ఈ నెల 10వ తేదీన తెలంగాణ రాష్ట్ర బంద్ కు భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బందులు కలిగించేలా ఉందంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాగరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే కోవిడ్ నిబంధనలను పాటించలేదంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. దీంతో స్థానిక కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. 

మరోవైపు హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన కాసేపటి క్రితం కరీంనగర్ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో అక్రమ కేసులను నిరసిస్తూ, 317 జీవోను పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న రాష్ట్ర బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు మద్దతు ప్రకటించాలని, బంద్ ను విజయవంతం చేయాలని బీజేపీ కోరింది.