కేంద్ర హోం శాఖామాత్యులు అమిత్‌ షా, ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ నేత మల్ఖిఖార్జున్‌ ఖర్గేపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గోవా, ఉత్తరాఖండ్‌ మరియు ఈశాన్య రాష్ట్రాల్లాంటి వాటిని అన్ని చిన్నవిగా పేర్కొంటూ విశాల భారతదేశంలో ఈ రాష్ట్రాలకు అసలు ప్రాధాన్యత లేకోవడం లేదంటే స్వల్ప ప్రాధాన్యత మాత్రమే ఉందని ఖర్గే చేసిన వ్యాఖ్యలపై షా విరుచుకుపడ్డారు. 

ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన షా, మాట్లాడుతూ ఈ రాష్ట్రాలు దేశంలో అతి ముఖ్యమైన భాగాలన్నారు. భారత మాత నుదిటిన సింధూరంలా గోవా ఉంటుందంటూ, భారత మాత అందాలను ఇది ద్విగుణీకృతం చేస్తుందన్నారు. ఈ రాష్ట్రాలలో ఇటీవల బీజెపీ భారీ మెజారిటీతో గెలవడాన్ని ఉద్దేశించి ఖర్గే ఈ చిన్ని రాష్ట్రాలనే మాట వాడారు. 

‘‘గోవాలో మేము విజయం సాధించడంతో పాటుగా ఉత్తరాఖండ్‌ మరియు ఈశాన్య ప్రాంతాల్లోని ఇతర రాష్ట్రాలలో విజయం సాధించిన తరువాత ఖర్గే స్పందిస్తూ ఇవి అతి చిన్న రాష్ట్రాలని సంభోధించారు. ఖర్గే సాహెబ్‌, అవి చిన్న రాష్ట్రాలే కానీ , అవి భారతదేశంలో అతి ముఖ్యమైన భాగాలు. అది మాత్రం మరిచిపోవద్దు. ఈ చిన్న రాష్ట్రాలను అవమానించవద్దు. గోవా... భారత మాత నుదిటిన సింధూరం లాంటిది. ఆ రాష్ట్రం చిన్నదే కావొచ్చు కానీ, ఆ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం బాధ్యత మాత్రం పెద్దది. మోదీ ప్రభుత్వ విధానమది’’అని షా అన్నారు. 

దక్షణ గోవాలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన , బీజెపీ ముఖ్య ఎన్నికల వ్యూహకర్త చిన్న రాష్ట్రాల అభివృద్ధి పట్ల కేంద్రం బాధ్యత చాలా పెద్దదన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రాల అభివృద్ధి కోసం పలు చర్యలను కేంద్రం తీసుకుంటుందన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా ఢిల్లీ లో బీజెపీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు తీవ్రంగా కృషి చేస్తుందన్నారు. ఈ రాష్ట్రానికి వార్షిక కేటాయింపులు ఏడు రెట్లు వృద్ధి చెందాయన్నారు. 

తీర ప్రాంత రాష్ట్రంలో పర్యటించిన షా, 2024 సాధారణ ఎన్నికల ప్రచారాన్ని గోవాలో ప్రారంభించారు. ఈ ఆధునిక తరపు చాణుక్యుడు, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రస్తుతం ఆ పార్టీ సౌత్‌ గోవా సీట్‌ను మాత్రం గెలుచుకుంది. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ లోపాలను వెల్లడించిన ఆయన , వారసత్వ రాజకీయాలను, అవినీతిని ఆ పార్టీ పెంచి పోషిస్తుందన్నారు. వారి కారణంగానే దేశం ఎంతో వెనుకబడిందన్నారు. 

ఇటీవల త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ నాయకుడు భారత్‌ జోడో యాత్ర పేరిట దేశమంతా పర్యటించడంతో పాటుగా ఈ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ ఓడిపోవడంపై చెణుకులను విసిరారు షా. 

‘‘రాహుల్‌ బాబా అక్కడకు వెళ్లారు... పూర్తి స్ధాయిలో ప్రచారం చేశారు. దెబ్బకు కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో త్రిపురలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటుచేశాము. నాగాలాడ్‌లో 13 మంది మా ఎంఎల్‌ఏలు మరలా గెలిచారు. మేఘాలయలో సైతం మా మద్దతుతో ప్రభుత్వం ఏర్పడింది’’ అని ఆయన అన్నారు. 

ఆర్టికల్‌ 370 విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఏమి చేయలేదని దుయ్యబట్టారు షా. కేంద్ర హోం శాఖామాత్యులు మాట్లాడుతూ గోవాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగా, కేంద్రం గోవాకు సంవత్సరానికి 432 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చేది. కానీ , మోదీ ప్రభుత్వం వచ్చాక గోవాకు ప్రతి సంవత్సరం 3వేల కోట్ల రూపాయలను అందిస్తున్నారన్నారు. షా మాట్లాడుతూ గోవా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మెరుగైన చర్యలను తీసుకుంటుందన్నారు. గత తొమ్మిది సంవత్సరాలలో గోవాలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతగానో తాము కృషి చేశామన్నారు. 

గోవా రాష్ట్ర ప్రజలకు డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం కింద మెరుగైన అభివృద్ధి అందించగలమనే భరోసా అందించిన షా, ముకుళిత హస్తాలతో సౌత్‌ గోవా సీటు ను బీజెపీకి తిరిగి ఇవ్వాలని అభ్యర్ధించారు. అంతేకాదు, మూడవసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు అందించాలన్నారు. ఈ సభకు హాజరైన వారు ఆయన ప్రసంగానికి మంత్రముగ్థులయ్యారు