యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అంతరిక్ష యాత్రలో అనూహ్య ఉద్రిక్తత నెలకొంది. అమెరికా అంతరిక్ష సంస్థ NASA చేపట్టిన Artemis-2 మిషన్లో అత్యంత కీలక దశలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అంతరిక్షంలో ప్రయాణిస్తున్న Orion వ్యోమనౌకతో భూమికి ఉన్న సంబంధాలు ఒక్కసారిగా తెగిపోవడం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసింది.
ఈ సంఘటన జేఎస్సీ లోని మిషన్ కంట్రోల్ సెంటర్లో చోటుచేసుకుంది. హ్యూస్టన్లోని ఈ కేంద్రంలో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు క్షణక్షణాన్ని గమనిస్తూ ఉండగా, అకస్మాత్తుగా ఓరియన్ నుంచి వస్తున్న డేటా స్ట్రీమ్ పూర్తిగా ఆగిపోయింది. క్షణం పాటు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.
సాధారణంగా అంతరిక్ష యాత్రల సమయంలో కమ్యూనికేషన్ అంతరాయం కలగడం సాధారణమే అయినప్పటికీ, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు… దాదాపు 40 నిమిషాల పాటు వ్యోమనౌక నుంచి ఎలాంటి సంకేతాలు అందకపోవడంతో నాసా బృందం తీవ్ర ఆందోళనకు గురైంది. ఈ సమయంలో అన్ని అత్యవసర ప్రోటోకాల్స్ను అమలు చేస్తూ, సమస్య ఏమిటో గుర్తించేందుకు నిపుణులు శ్రమించారు.
ఈ కమ్యూనికేషన్ బ్లాక్అవుట్కు ప్రధాన కారణం వ్యోమనౌక భూమి, చంద్రుని మధ్య ఉన్న ఒక నిర్దిష్ట స్థానం గుండా ప్రయాణించడమే కారణమని వారు భావించారు. ఈ సమయంలో సిగ్నల్ ప్రసారంలో అంతరాయం కలగడం సహజమని తెలిపారు.
సరిగ్గా అంచనా వేసిన సమయానికి ఓరియాన్ వ్యోమనౌక చంద్రుడి అవతలి వైపు నుంచి తిరగి బయటకు వచ్చింది. దీంతో తిరిగి భూమిని సిగ్నల్స్ చేరాయి. ఈ 40 నిమిషాల వ్యవధి నాసా బృందానికి ఒక పరీక్షగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఉన్నవారు ఈ పరిణామాన్ని ఉత్కంఠగా గమనించారు.
Artemis Program లో భాగమైన ఆర్టెమిస్-2 మిషన్ భవిష్యత్తులో మనుషులను చంద్రుడిపైకి పంపే లక్ష్యానికి కీలకమైన అడుగు. ఈ మిషన్ విజయవంతమైతే, చంద్రునిపై మానవ యాత్రలకు కొత్త దారులు తెరుచుకునే అవకాశముంది.



