హైదరాబాద్ పాతబస్తీలో శాంతిభద్రతల పరిస్థితులపై బెంగాళిలపై జరుగుతున్న దాడులపై రాజకీయంలో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పాతబస్తీలో బెంగాలీ కుటుంబాలు నివసించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు బండి సంజయ్ స్వయంగా వెళ్లి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకే నగరంలో రెండు రకాల చట్టాలు అమలు అవుతున్నాయా? అని ప్రశ్నించారు. పాతబస్తీకి ఒక విధానం, ఇతర ప్రాంతాలకు మరో విధానం అమలు చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నిన్న రాత్రి బెంగాలీ కుటుంబాలు తమ సమస్యలను మంత్రి ముందు వెల్లబుచ్చుకున్నారు. తాము భయాందోళనలతో జీవిస్తున్నామని, సరైన రక్షణ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని వారు బండి సంజయ్ తో విన్నవించుకున్నారు.
ఇటీవల పాతబస్తీలో అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు వెళ్లిన GHMC అధికారులపై జరిగి దాడులు ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గారూ.. పాతబస్తీని ఏమైనా మజ్లిస్కు రాసిచ్చారా? ఎంఐఎం నేతలు దాడులు, దౌర్జన్యాలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారా?’ అని బండి సంజయ్ నిలదీశారు. ఈ దాడులకు కారణమైన ఎంఐఎం నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం కారణంగా బెంగాలీలు ఇబ్బందులు పడుతున్నారని, ఆవేదన వ్యక్తం చేశారు.
ఇతర ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేపడితే వెంటనే పోలీసులు లాఠీచార్జ్లు చేసి, కేసులు నమోదు చేస్తున్నారని అదే చట్టాన్ని పాతబస్తిలో ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. పాతబస్తీకి ఒక రూల్, ఇతర ప్రాంతాలకు మరో రూల్ అమలు చేస్తున్నారా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు.
నగరంలోకి రోహింగ్యాలు అక్రమంగా చొరబడి ఓటర్ కార్డులు కూడా పొందారని ఆరోపించారు. అధికారులపై దాడులు చేసేవారిపై చర్యలు తీసుకోకపోతే పాతబస్తీలో పరిస్థితులు చేయిదాటిపోతాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలని అక్కడి బెంగాలీ సమాజాన్ని ఆయన కోరారు.



