ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, రాజేశ్వరరావు పదవీ కాలం ముగియడంతో వారి స్థానాల్లో మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇన్‌చార్జ్ దాసోజు శ్రవణ్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పంపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సంగారెడ్డికి చెందిన కుర్రా సత్యనారాయణ ఎరుకల సామాజిక వర్గానికి చెందినవారు. 1999లో ఆయన సంగారెడ్డి నుంచి టీడీపీ-బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో బీజేపీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు.  

దాసోజు శ్రవణ్ గతంలో ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌ హైదరాబాద్ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన బీసీ వర్గాల గొంతుకను బలంగా వినిపించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ పేర్లను ప్రతిపాదించడంపై దాసోజు, కుర్రా సత్యనారాయణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు