తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ సందడి కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాలు మినహా ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ , తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. సినీ ప్రముఖులు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అక్కడితో తమ బాధ్యత పూర్తయిందనుకోకుండా సోషల్‌మీడియా వేదికగా ఓటర్లను చైతన్య పరుస్తున్నారు. చిరంజీవి , ఎన్టీఆర్‌ , అల్లు అర్జున్‌ , నాగచైతన్య , రాజమౌళి , అల్లు అరవింద్‌ తదితరులు హైదరాబాద్‌లో తమ ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ క్రమంలోనే చిరంజీవి గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను గుర్తు చేసుకున్నారు. పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు వస్తూ ‘లాస్ట్‌టైమ్‌ మౌనవ్రతం అని చెప్పాననుకుంటా’ అంటూ నవ్వులు పంచారు. ‘‘మా కుటుంబమంతా ఓటేసింది. ఓటు మన హక్కు మాత్రమే కాదు... అది మన బాధ్యత. అది మన రాష్ట్ర, దేశ రూపురేఖలను మార్చేస్తుంది. మనకు సుపరిపాలన అందిస్తారనే నమ్మకం ఉన్న అభ్యర్థులను ఎన్నుకోండి’’ అని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో ఆయన ఓటు వేశారు.