ఒత్తిడి లేని విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అంగన్వాడీ లో పిల్లలను నమోదు చేయంచి వారి భవిత కు పునాది వేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు.సోమవారం జిల్లాలోని మహ్మద్ గౌస్ పల్లి అంగన్వాడి కేంద్రం లో తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న అమ్మ మాట - అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.తొ కలసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాన్యుడికి విద్య అందని ద్రాక్ష లా మిగలరాదని రాష్ట్రం లో 3 సం.లు నిండిన ప్రతీ బిడ్డ పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసించాలనే గొప్ప లక్ష్యం తో రాష్ట్ర ముఖ్యమంత్రి తేది.15-07-2024 నుండి 20-07-2024 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న అమ్మ మాట - అగన్వాడి బాట "" అంగన్వాడి లో పిల్లలను నమోదు చేయండి వారి భవితకు పునాది వేయండి"" అనే ముందుమాటతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. పిల్లలకు తొలి ఒడి అమ్మ అయితే మలిఒడి అంగన్‌వాడీ కేంద్రాలేనని ఆన్నారు. 

పేద పిల్లలకు పౌష్టికాహారం, విద్య, భద్రత అందేలా చూడాలన్నారు. అమ్మ స్థానంలో ఉన్న అంగన్‌వాడీ సిబ్బంది, పిల్లలకు అమ్మ ప్రేమను పంచేలా చూడాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వం నూతన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిందని అందులో భాగంగానే అంగన్వాడీలోని పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడంతోపాటు విద్యను కూడా అందించాలని ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం నర్సరీ విద్యను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు "తొలి గురువు అమ్మ ఒడి - మలి గురువ్వు అంగన్వాడి" అని అన్నారు.

గతం లో ఎప్పుడు లేనటువంటి విధంగా అంగన్వాడీ పిల్లలకు ఏకరూప దుస్తులను ప్రభుత్వం అందిస్తుందని , ఆట వస్తువులు , పౌష్టిక ఆహారం అందిస్తున్నామని ప్రతి బిడ్డ తల్లి తమ బిడ్డలను అంగన్వాడి కేంద్రాలకు పంపించాలని అక్కడ మంచి ఆహారం మంచి బడి అన్ని వసతులు ఉన్నాయని చెప్పాలని అన్నారు. చదువంటే బరువులు మోసే యంత్రం లా పిల్లలను మార్చడం కాదని, బాధ్యత కల్గిన పౌరులుగా ఎదిగేలా వారిని తీర్చిదిద్దడమని అన్నారు. నేటి సమాజంలో చదువుల పేరు మీద పిల్లలపై ఎన్నో విధాలుగా ఒత్తిడి పెరుగుతుందని, దాని కారణం గా వారు ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. 

ఇలాంటి ఇబ్బందులకు దూరంగా పిల్లకు ఆహ్లాదకరం గా ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను అందించడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.తల్లి ఒడిలో నుండి అంగన్వాడీ బడి లోకి వస్తున్న పిల్లలందరికీ అదే తల్లి ప్రేమతో వారికి సరైన విద్యా బుద్దులు నేర్పేలా అంగన్వాడీ టీచర్లకు ముందస్తు శిక్షణ ఇవ్వడం జరిగిందని, నేటి నుండి రాష్ట్రం లోని అంగన్వాడీ కేంద్రాలన్నీ ప్రీ స్కూల్స్ గా పని చేస్తాయని, ఈ ప్రీ స్కూల్స్ లలో పిల్లలకు ఎలాంటి మానసిక ఒత్తిడి లేని ఆట పాటలతో కూడిన విద్యాభ్యాసం మరియు నాణ్యమైన పౌష్టికాహారం అందించడం జరుగుతుందని, తద్వారా పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా, బాధ్యతాయుతంగా ఎదుగుతారని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం లో భాగంగా డ్వాక్రా మహిళలతో, గ్రామం లోని తల్లి తండ్రులతో సమావేశమై అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న ప్రీ స్కూల్ సేవల గురించి వివరించడం జరుగుతుందని, తరువాత అంగన్వాడీ కేంద్రం పరిసరాలను పరిశుభ్రం చేసే కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని వివరించారు.

ఈ సందర్భంగా తల్లితండ్రులు 3 నుండి 5 సం.లోపు వయస్సున్న తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రం లో చేర్పించి వారు పూర్వ ప్రాథమిక విద్యను పొందేలా చూడాలని రాష్ట్రoలోని తల్లి తండ్రులకు పిలుపునిచ్చారు.అంగన్వాడీ నాణ్యమైన సరుకులు పొందడం మన హక్కు కావున లబ్ధిదారులు తీసుకుంటున్న సరుకుల్లో ఏమైనా నాణ్యత లోపిస్తే వెంటనే వెనక్కు ఇచ్చి నాణ్యమైన సరుకులను మాత్రమే పొందాలని, వాటినే లబ్ధిదారులకు అందించాలని సూచించారు.

ప్రభుత్వం తొందరలోనే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు , 5 లక్షల రూపాయల తో నూత గృహాలను నిర్మించడానికి కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేస్తుందని, ప్రతి నియోజక వర్గానికి ప్రభుత్వం 3,000 గృహాలను మంజూరు చేస్తుందని , రైతు భరోసా పై అభిప్రాయాలను సేకరించి విధివిధానాలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం లో కొత్తగా ప్రీస్కూల్ (పూర్వ ప్రాథమిక విద్య) లో చేరిన చిన్నారులకు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, డిడబ్లుఓ తో కలిసి అక్షరాభ్యాసం మంత్రి చేయించారు.  

అదేవిధంగా 5 సం.లు వయస్సు నిండి ప్రాథమిక పాఠశాలకు ప్రమోట్ అయిన పిల్లలు ప్రత్యేక వస్త్రధారణలో రాగా వారికి మంత్రి సర్టిఫికెట్లు ప్రధానం చేసి "గ్రాడ్యుయేషన్ డే" నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.,ఓ ఎస్ డి మహేష్ బి గీతే, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ, డి డబ్లు ఓ స్వర్ణలత లెనినా CDPO లు K.స్వాతి, V. హేమలత, G. మల్లీశ్వరి, K. శిరీష, EP ప్రేమలత, ములుగు MPDO, MEO, DCPO J. ఓంకార్, ప్రీ స్కూల్ లో చేరిన పిల్లలు, సంబంధిత అధికారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.