Monday, September 7, 2026

22Aపై చర్చ తర్వాతే నిర్ణయం.. బీజేపీ సభ్యుల తీరుపై రేవంత్‌ ఫైర్‌

Must read

తెలంగాణ శాసనసభలో బీజేపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 22A అంశంపై సభలో చర్చిస్తామని ముందుగానే స్పష్టం చేసినప్పటికీ బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగడం సరికాదని అన్నారు. సభలో చర్చ జరిగిన తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.22A అంశంపై బీజేపీ సభ్యులు తమ అభిప్రాయాలను సభలో వెల్లడించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఈ అంశాన్ని బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)లో ప్రస్తావించాలని సూచించారు. షార్ట్ డిస్కషన్‌కు అవకాశం ఇస్తామని ఇప్పటికే చెప్పిన తర్వాత కూడా ఆందోళన చేయడం ఎందుకని ప్రశ్నించారు.

బీజేపీ తన “చీకటి మిత్రుడిని” కాపాడేందుకు ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సభలో విచారణకు ఆదేశించామని తెలిపారు. అలాగే భూముల వ్యవహారాలు, విద్యుత్‌ కొనుగోళ్లపై కూడా సభలో చర్చ జరిగిన తర్వాతే విచారణకు ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు.“చర్చ లేకుండా ఉరి శిక్ష వేయాలని అనడం సరికాదు” అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏదైనా అంశంపై పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. బీజేపీ సభ్యులు చెప్పాలనుకున్న విషయాలపై చర్చించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.ఇదే సమయంలో శాసనసభ స్పీకర్‌ స్థానానికి జరిగిన అవమానంపై సీఎం తీవ్రంగా స్పందించారు. సభలో సభ్యులకు ఏదైనా జరిగినప్పుడు వారిని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంటుందని అన్నారు. అలాంటి స్పీకర్‌ స్థానానికే అవమానం జరగడం బాధాకరమని పేర్కొన్నారు.స్పీకర్‌కు జరిగిన అవమానం ఒక్క వ్యక్తికి జరిగిన అవమానం కాదని, శాసనసభలోని సభ్యులందరికీ జరిగిన అవమానమని రేవంత్‌ రెడ్డి అన్నారు. స్పీకర్‌ స్థానానికి ఎంతో గౌరవం ఉందని, సభలో సభ్యుల గౌరవంతో పాటు ప్రజల గౌరవాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.

“సభాపతిపై సభ్య సమాజం సహించలేని మాటలు మాట్లాడతారా?” అని రేవంత్‌ ప్రశ్నించారు. సమాజం తలవంచుకునేలా మాట్లాడటం మొత్తం శాసనసభకే అవమానమని వ్యాఖ్యానించారు. సభలో ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్పీకర్‌ స్థాన గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని సూచించారు.సభా నాయకుడిగా తాను హామీ ఇస్తున్నానని, బీజేపీ సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని సీఎం కోరారు. వారు ప్రస్తావించాలనుకుంటున్న అంశాలను సభలో చర్చకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తుందని తెలిపారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని అన్నారు.ఇక నిన్న ఫామ్‌హౌస్‌కు బీజేపీ సభ్యులను పిలిపించి రెచ్చగొట్టి పంపించారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. అనంతరం శాసనసభలో జరిగిన పరిణామాలు సభ్య సమాజం క్షమించరాని విధంగా ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

22Aతో పాటు కాళేశ్వరం, భూముల వ్యవహారాలు, విద్యుత్‌ కొనుగోళ్ల వంటి అంశాలు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!