తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై అక్రమ మైనింగ్, భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ ఆయన్ను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం సోమవారం గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వినతి పత్రం సమర్పించింది. మంత్రికి సంబంధించిన అక్రమ మైనింగ్, భూ కబ్జాలపై ఆధారాలను గవర్నర్కు అందజేసినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు.
మంత్రికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. జంట జలాశయాల పరిరక్షణ ప్రాంతాల్లో కూడా మైనింగ్ జరుగుతోందని, ఇందుకు అవసరమైన అనుమతులు తీసుకోలేదని పేర్కొంది. ఈ అక్రమాల వల్ల ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో వివరించింది.
ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సస్పెండ్ చేసిందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్కు నోటీసులు ఇచ్చినట్లు ప్రభుత్వం సభలో అంగీకరించడం అక్రమాలకు నిదర్శనమని వారు ఆరోపించారు.
గవర్నర్తో భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యవహారంపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వద్దే హోం శాఖ ఉన్నందున రాష్ట్ర దర్యాప్తు సంస్థలపై తమకు నమ్మకం లేదని తెలిపారు. పొంగులేటి మంత్రిగా కొనసాగితే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని, కాబట్టి ఆయన్ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని కోరారు.
అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. దమ్ముంటే పొంగులేటి వ్యవహారంతో పాటు అమృత్ పథకం, ఫోన్ ట్యాపింగ్, సింగరేణి అక్రమాలపై కూడా విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ మౌనం పాటించడం కూడా అనుమానాలకు తావిస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు.



