పీసీసీ మాజీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఈనెల 24న ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతల సమక్షంలో డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.సుమారు రెండేళ్ల నుంచి టీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలకు డీఎస్ దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆయన ఢిల్లీలో సోనియాగాంధీతో సమావేశం కావడంతో డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖరారైంది.2015లో బంగారు తెలంగాణ లక్ష్యంగా డీఎస్ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 2016 జూన్‌లో టీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా డీఎస్ పదవీకాలం ఈ ఏడాది జూన్ 21న ముగియనుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో డీఎస్ చేరికను ఆ పార్టీ సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. జగ్గారెడ్డి వంటి నేతలు ఇప్పటికే డీఎస్ చేరిక వార్తలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా డీఎస్ రెండో కుమారుడు ధర్మపురి అరవింద్ గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.