ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై కేంద్ర సహాయమంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ స్పందించారు. బీఆర్ఎస్ నాయకులు అహంకారంతో వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్య విలువలను పక్కనబెట్టి రాజకీయ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలకు ఎంతో సహనం ఉన్నప్పటికీ, ఆ సహనాన్ని బలహీనతగా భావించకూడదని హెచ్చరించారు.
కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన బండి సంజయ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి జరిగిన విషయం తనకు ఆలస్యంగా తెలిసిందన్నారు. ఘటనపై పూర్తిస్థాయి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. బీజేపీ ఎప్పుడూ హింసను ప్రోత్సహించదని, దాడులు చేయడం తమ పార్టీ సంస్కృతి కాదని స్పష్టం చేశారు. అయితే బీఆర్ఎస్ నాయకులు కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చుతున్నారని మండిపడ్డారు.
“మా కార్యకర్తలకు ఓర్పు ఉంది. కానీ ఆ ఓర్పును పిరికితనంగా భావిస్తే సహించం” అంటూ బండి సంజయ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయ విభేదాలు ఉండొచ్చని, కానీ వాటిని హింసాత్మక ఘటనలకు దారి తీసేలా చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ అభిప్రాయాలను వ్యక్తపరచే హక్కు ఉందని, కానీ అధికార దుర్వినియోగంతో ప్రత్యర్థులను అణగదొక్కాలని చూడటం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.
గత పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అనేక ఘటనలను ప్రజలు మరిచిపోలేదన్నారు. “ఇప్పుడు నీతి, న్యాయం గురించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతల మాటలు వింటే నవ్వొస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన అరాచకాలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయి” అంటూ వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై అనేక ఒత్తిళ్లు తీసుకొచ్చారని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడం, కేసులు పెట్టించడం, కార్యకర్తలపై దాడులు చేయించడం వంటి ఘటనలు అప్పట్లో సాధారణంగా మారిపోయాయని విమర్శించారు. ఇప్పుడు అదే నేతలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు.
కరీంనగర్లో ఇటీవల రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి మరింత కలకలం రేపింది.
ఈ ఘటనపై పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. దాడికి సంబంధించిన వివరాలను సేకరిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, స్థానికుల సమాచారం ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా అదనపు పోలీసు బలగాలను కూడా మోహరించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు మాత్రం బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు. తమ పార్టీకి ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదన్నారు.రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతున్న సమయంలో కరీంనగర్ ఘటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే రోజుల్లో ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో మరింత దుమారం రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.



