ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నెల్లూరు, కడప జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. పేదల సేవతో పాటు భగవంతుని సేవలో పాల్గొంటూ ఒకే రోజు రెండు ముఖ్య కార్యక్రమాలను ఆయన నిర్వహించనున్నారు.మొదటగా నెల్లూరు జిల్లా వింజమూరులో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం కింద లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు అందజేస్తారు. అనంతరం ఆయన నేరుగా కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంకు వెళ్లి సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పించనున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు నేరుగా అతిపెద్ద నగదు బదిలీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం ద్వారా జరుగుతోందని అధికారులు తెలిపారు. గత 22 నెలల్లోనే రూ.60,437 కోట్లను పింఛన్ల రూపంలో పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ ఏప్రిల్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా 62.60 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,724 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.నెల్లూరు జిల్లాలో సీఎం పాల్గొనే ఈ కార్యక్రమంలో 2.91 లక్షల మందికి రూ.128 కోట్లు పంపిణీ చేయనున్నారు. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో 39,330 మందికి రూ.17.81 కోట్లు, వింజమూరు మండలంలో 5,484 మందికి రూ.2.47 కోట్ల పింఛన్లు అందించనున్నారు.
సీఎం పర్యటన షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11 గంటలకు వింజమూరు చేరుకుంటారు. అక్కడ ఉత్తర ఎస్సీ కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పాతూరు ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించే ప్రజావేదిక సభలో పాల్గొంటారు.తర్వాత మధ్యాహ్నం 2.15 గంటలకు ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతంపై చర్చించనున్నట్లు సమాచారం.
ఇక సాయంత్రం 4.25 గంటలకు సీఎం ఒంటిమిట్టకు చేరుకుని, సాయంత్రం 6.15 గంటలకు కోదండ రామస్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం 6.45 గంటలకు నిర్వహించే సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి తలంబ్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి భువనేశ్వరి కూడా పాల్గొంటారు.
పర్యటన ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు ఒంటిమిట్టలోనే బస చేయనున్నారు. ఈ పర్యటన ద్వారా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక పరంపర రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టమవుతోంది.



