Tuesday, September 8, 2026

‘ముందు నన్ను అవమానించిన దానిపై మాట్లాడు’.. హరీశ్‌రావుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కౌంటర్

Must read

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. అసెంబ్లీ వద్ద ఇటీవల జరిగిన ఘటనలు, మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై చర్చ సందర్భంగా ఇరువురు పరస్పరం తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. ఈ క్రమంలో తనను అవమానించిన అంశంపై ముందుగా మాట్లాడాలని హరీశ్‌రావును స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రశ్నించారు.సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మిలంటే తనకు అత్యంత గౌరవం ఉందని స్పీకర్ తెలిపారు. వారు తనకు తోబుట్టువులతో సమానమని పేర్కొన్నారు. సబితా ఇంద్రారెడ్డికి జరిగిన ఘటనపై తానే విచారణ జరిపించాలని ఆదేశించినట్లు గుర్తుచేశారు. మహిళా ఎమ్మెల్యేల అంశంపై ప్రభుత్వం, పోలీసులు విచారణ జరుపుతారని స్పీకర్ స్పష్టం చేశారు.అయితే తనపై జరిగిన అవమానాన్ని కూడా సభలో చర్చించాల్సిన అవసరం ఉందని గడ్డం ప్రసాద్ అన్నారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, తన తల్లిదండ్రులను అవమానకరంగా మాట్లాడారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సభా అధ్యక్షుడిపైనే బీఆర్ఎస్ సభ్యుడు అనుచితంగా మాట్లాడారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావును ఉద్దేశించి స్పీకర్ తీవ్రంగా స్పందించారు. తాను ఎలాంటి ఒత్తిళ్లకు భయపడబోనని స్పష్టం చేశారు. సభలో ఆందోళన చేసినంత మాత్రాన తాను వెనక్కి తగ్గబోనని అన్నారు. తన తల్లిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని హరీశ్‌రావు చెబుతున్నారని, అయితే తన తల్లిదండ్రుల గురించి అవమానకరంగా మాట్లాడిన అంశంపై సమాధానం చెప్పాలని స్పీకర్ డిమాండ్ చేశారు.“ముందు నన్ను అవమానించిన అంశంపై మాట్లాడు హరీశ్” అంటూ స్పీకర్ సభలో తీవ్రంగా వ్యాఖ్యానించారు. అదే సమయంలో సబితమ్మకు జరిగిన ఘటనపై విచారణ జరపాలని తానే చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. మహిళా ఎమ్మెల్యేల సమస్యపై చర్యలు తీసుకోవడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే తనపై జరిగిన ఘటనను కూడా విస్మరించకూడదని స్పష్టం చేశారు.

మరోవైపు.. ఈ అంశంపై మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా అసెంబ్లీలో స్పందించారు. మహిళా శాసనసభ్యులపై జరిగిన ఘటనను పోలీసులు పరిశీలిస్తామని చెబుతున్నప్పటికీ, ఇప్పటివరకు విచారణ జరగలేదని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డిని పురుష పోలీసులు గొంతు పట్టుకుని నెట్టారని హరీశ్‌రావు ఆరోపించారు.ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తమపైనే తిరిగి కేసులు నమోదు చేశారని హరీశ్‌రావు విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేలను, ప్రతిపక్ష సభ్యులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పైనే ఉందని అన్నారు. అయితే అసెంబ్లీలో జరిగిన పరిణామాలను చూస్తే ఇది గౌరవ సభగా కాకుండా కౌరవ సభలా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.“కౌరవులకు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుంది” అంటూ హరీశ్‌రావు అధికార కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఈ అంశంపై ఇక మరింత రాద్ధాంతం అవసరం లేదని కూడా ఆయన పేర్కొన్నారు.

అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల ప్రవర్తన, మహిళా పోలీసులతో బీఆర్ఎస్ నేతల వ్యవహారం, స్పీకర్‌పై వ్యాఖ్యలు వంటి అంశాలు రాజకీయ వివాదానికి కేంద్రంగా మారాయి.తాజాగా అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్, హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ముదిరింది. ఒకవైపు మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనపై విచారణ జరపాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తుండగా.. మరోవైపు స్పీకర్‌పై జరిగిన అనుచిత వ్యాఖ్యలు, ప్రవర్తనపై కూడా చర్యలు తీసుకోవాలని అధికార పక్షం కోరుతోంది. ఈ నేపథ్యంలో సభలో ఈ అంశంపై మరింత చర్చ జరిగే అవకాశం ఉంది.

 

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!