తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కాన్వాయ్లో తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. పోలీస్ కస్టడీలో మృతి చెందిన 26 ఏళ్ల యువకుడి తల్లిదండ్రులు తమ కుమారుడి మరణానికి న్యాయం చేయాలంటూ సీఎం కాన్వాయ్కు అడ్డుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. చెన్నైలోని సచివాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిరసనకు దిగిన మృతుడి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో ముఖ్యమంత్రి విజయ్ కాన్వాయ్ వస్తున్న సమయంలో స్థానికులు ఫెన్సింగ్ వెనుక నిలబడి ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంతలో ఓ మహిళ, ఓ పురుషుడు ఒక్కసారిగా ఫెన్సింగ్ను దాటి భద్రతా వలయాన్ని ఛేదిస్తూ కాన్వాయ్ వైపు పరుగెత్తారు. మహిళను భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకోగా.. పురుషుడు మాత్రం కాన్వాయ్కు మరింత దగ్గరగా వెళ్లగలిగాడు.
ఈ పరిణామంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితిని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే ముఖ్యమంత్రి కాన్వాయ్ను నిలిపివేశారు. అనంతరం నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం కాన్వాయ్కు ఇంత దగ్గరగా వ్యక్తులు చేరుకోవడం భద్రతా వ్యవస్థపై పలు ప్రశ్నలను లేవనెత్తింది.
పోలీస్ కస్టడీలో యువకుడి మృతి
ఈ నిరసనకు కారణం మార్చిలో శివగంగై జిల్లాలో చోటుచేసుకున్న ఘటన. 26 ఏళ్ల దళిత యువకుడు ఆకాష్ డెనిసన్ను చిన్నపాటి దాడి కేసులో అనుమానితుడిగా మనమదురై పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసుల కస్టడీలో ఉండగా అతడు అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం చికిత్స కోసం మదురైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
తన కుమారుడి మరణంపై కుటుంబ సభ్యులు పలు ఆరోపణలు చేశారు. విచారణ సమయంలో పోలీసులు యువకుడిపై దాడి చేశారని, కులం పేరుతో దూషించారని అతడి తండ్రి కన్నన్ ఆరోపించినట్లు వార్తా సంస్థలు గతంలో నివేదించాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో కుమారుడి మరణానికి న్యాయం చేయాలని కోరుతూ కన్నన్, ఆయన భార్య తమ బంధువులతో కలిసి నిరసన చేపట్టారు.
అదే క్రమంలో ముఖ్యమంత్రి విజయ్ సచివాలయం వైపు వెళ్తున్న సమయంలో ఆయన కాన్వాయ్ సమీపంలోకి వెళ్లేందుకు వారు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు.
ముఖ్యమంత్రి విజయ్ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ఈ ఘటన రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి కాన్వాయ్ చుట్టూ సాధారణంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అలాంటి భద్రతా వలయాన్ని దాటి నిరసనకారులు కాన్వాయ్కు చేరువ కావడం ఇప్పుడు ప్రశ్నలను లేవనెత్తుతోంది.
మరోవైపు పోలీస్ కస్టడీలో యువకుడి మృతి, కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలపై కూడా చర్చ జరుగుతోంది. అయితే వారు చేసిన ఆరోపణలపై సంబంధిత అధికారుల నుంచి పూర్తి వివరాలు, దర్యాప్తు అంశాలు వెలువడాల్సి ఉంది.
కాగా, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సెప్టెంబర్ 3న అసెంబ్లీలో పలు కీలక అంశాలపై మాట్లాడారు. అదే రోజు ఆయన కార్యక్రమాల సందర్భంగా కాన్వాయ్ భద్రతలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రస్తుతం సీఎం విజయ్ కాన్వాయ్ వద్ద చోటుచేసుకున్న భద్రతా వైఫల్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ ఘటనపై విస్తృత చర్చ జరుగుతోంది. యువకుడి కుటుంబం చేస్తున్న న్యాయ డిమాండ్కు ప్రభుత్వం, పోలీసులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.




