పార్టీలో ఎవరికైనా సమస్యలు, అసంతృప్తులు ఉంటే వాటిని చర్చించేందుకు అనేక వేదికలు ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అయితే పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడటం మాత్రం క్షమించరాని తప్పని స్పష్టం చేశారు. ఎవరైనా బహిరంగంగా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవనే సంకేతాన్ని ఏఐసీసీ ఇచ్చిందని అన్నారు.
కొండా సురేఖ తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను ఖండించాల్సి ఉండేదని పీసీసీ చీఫ్ అభిప్రాయపడ్డారు. అయితే ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడాన్ని ఏఐసీసీ తీవ్రంగా పరిగణించిందని తెలిపారు. క్రమశిక్షణ సంఘం సమగ్రంగా విచారణ జరిపి ఇచ్చిన నివేదిక ఆధారంగానే కాంగ్రెస్ హైకమాండ్ చర్య తీసుకుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎవరినీ బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. క్రమశిక్షణ సంఘం సమర్పించిన నివేదికలో ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని అంశాలను కూలంకషంగా పొందుపరిచారని తెలిపారు. పార్టీ తీసుకున్న నిర్ణయం వెనుక క్రమశిక్షణ అంశమే ప్రధానంగా ఉందని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ విస్తరణ తమకు ప్రధాన అంశం కాదని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు, వాటిలో జరగాల్సిన చర్చలే ప్రస్తుతం తమకు కీలకమని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అసెంబ్లీ వ్యవహారాలపై పార్టీ ప్రధానంగా దృష్టి సారిస్తోందని తెలిపారు.కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని తాము కోరుకుంటున్నామని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. ఆమె పార్టీకి దూరం కావాలని తాము కోరుకోవడం లేదని సంకేతాలు ఇచ్చారు. అయితే పార్టీ క్రమశిక్షణ విషయంలో మాత్రం ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు.
క్రమశిక్షణ విషయంలో కులాలు, మతాలు, ప్రాంతాలను తాము చూడబోమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని తెలిపారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను ఆదరించాల్సిన బాధ్యతను గుర్తిస్తోందని చెప్పారు. భవిష్యత్తులో బీసీలకు మరింత పెద్దపీట వేయాలన్న ఆలోచన హైకమాండ్కు ఉందని వెల్లడించారు.కొండా సురేఖ వ్యవహారం నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఇప్పటికే విస్తృత చర్చ జరుగుతోంది. తాజాగా పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారంపై పార్టీ వైఖరిని మరింత స్పష్టం చేశాయి. ఒకవైపు కొండా సురేఖ పార్టీలో కొనసాగాలని కాంగ్రెస్ నాయకత్వం కోరుకుంటుండగా, మరోవైపు క్రమశిక్షణ విషయంలో మాత్రం రాజీ ఉండదనే సంకేతాలను మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చారు.
దీంతో కొండా సురేఖ భవిష్యత్ రాజకీయ అడుగులు ఎలా ఉండబోతాయన్న అంశం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఆమె కాంగ్రెస్లోనే కొనసాగుతూ పార్టీ నాయకత్వంతో సమన్వయం చేసుకుంటారా? లేక తన తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తారా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.




