వినాయక్ నగర్ డివిజన్ పరిధిలో ప్రతిపాదిత రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం అభివృద్ధి పనులను స్వాగతిస్తున్నప్పటికీ, ప్రతిపాదిత నిర్మాణం కారణంగా తమ నివాసాలు, రాకపోకలు, జీవన విధానంపై తీవ్ర ప్రభావం పడుతుందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రాజెక్టు కోసం మార్కింగ్ చేపట్టడంతో పలు ఇళ్లు తొలగించాల్సి వచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఇరుకుగా ఉన్న కాలనీ రహదారులు ప్రతిపాదిత ఆర్యూబీ నిర్మాణం అమలు అయితే మరింత కుంచించుకుపోయే ప్రమాదం ముందని ఆవేదన వ్యక్త పరిచారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలు కూడా సులభంగా రాలేని పరిస్థితి ఏర్పాడుతుందన్నారు.
ఈ సమస్యను స్థానికులు మాజీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి దృష్టికి తీసుకెళ్లగా, మాజీ కార్పొరేటర్ వెంటనే స్పందించారు. బాధితుల సమస్య తీవ్రతను గుర్తించిన ఆమె మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్తో అపాయింట్మెంట్ ఏర్పాటు చేసి, కాలనీవాసులను ఆయన వద్దకు తీసుకెళ్లారు. బాధితులు తమ సమస్యలను, ప్రాజెక్టు అమలుతో ఎదురయ్యే ఇబ్బందులను ఎంపీకి వివరించారు.
కాలనీవాసుల వినతిని శ్రద్ధగా విన్న ఎంపీ ఈటల రాజేందర్ వెంటనే స్పందించారు. ప్రజల ఆందోళనలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, ప్రజలకు అన్యాయం జరగకుండా తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ అంశంపై సంబంధిత డీజీఎం (డిప్యూటీ జనరల్ మేనేజర్) సహా రైల్వే అధికారులతో చర్చించి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించేలా ప్రయత్నిస్తానని చెప్పారు.
అభివృద్ధి ప్రాజెక్టులు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు కావాలని, అవసరమైతే ప్రణాళికలో మార్పులు చేసి ప్రజల ఇళ్లు, రాకపోకలకు ఇబ్బంది లేకుండా పరిష్కారం కనుగొనే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తానని ఎంపీ తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికే గానీ, ఇబ్బందులు సృష్టించడానికి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
స్థానికులు కూడా అభివృద్ధి పనులకు వ్యతిరేకం కాదని, అయితే ప్రాజెక్టు అమలులో ప్రజల ప్రయోజనాలు, భద్రత, నివాస హక్కులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. తమ ఇళ్లు కోల్పోకుండా, రహదారులు మరింత ఇరుకుగా మారకుండా, అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా ప్రణాళికను పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మహేశ్వరి, వీరేశం, సుధాకర్, శ్రీనివాస గుప్తా, శ్రీధర్ బాబు, రాణి తదితరులు పాల్గొని తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కారానికి ప్రజాప్రతినిధులు స్పందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూనే, అధికారులు కూడా ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని కోరుతున్నారు.




