వినాయక్ నగర్ డివిజన్ పరిధిలో ప్రతిపాదించిన ఆర్యూబీ (రైల్వే అండర్ బ్రిడ్జి) నిర్మాణంపై స్థానిక కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్యూబీ నిర్మాణం కోసం అధికారులు మార్కింగ్ చేయడంతో పలు ఇళ్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.ఆర్యూబీ నిర్మాణం జరిగితే ఇప్పటికే ఇరుకుగా ఉన్న కాలనీ రోడ్లు మరింత ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని స్థానికులు తెలిపారు. గోడలు నిర్మిస్తే అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.ఈ సమస్యను కాలనీవాసులు మాజీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి దృష్టికి తీసుకెళ్లగా, ఆమె వెంటనే స్పందించి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అపాయింట్మెంట్ తీసుకుని బాధితులను ఆయన వద్దకు తీసుకెళ్లారు.కాలనీవాసుల సమస్యలను విన్న ఎంపీ ఈటల రాజేందర్ వెంటనే స్పందించారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, సంబంధిత డీజీఎం అధికారులతో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మహేశ్వరి, వీరేశం, సుధాకర్, శ్రీనివాస గుప్తా, శ్రీధర్ బాబు, రాణి తదితరులు పాల్గొన్నారు.
ఆర్యూబీ సమస్యపై రాజ్యలక్ష్మి చొరవ.. ఎంపీ ఈటల రాజేందర్తో బాధితుల భేటీ




