మల్కాజిగిరి కమిషనర్ ఆఫ్ పోలీస్ సుమతి ఆధ్వర్యంలో “మీ సురక్ష” కార్యక్రమంలో భాగంగా సైబర్ అవగాహన, ప్రజా భద్రత అంశాలపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. సాయినాథ్పురంలోని ప్రశాంత్ గార్డెన్లో జరిగిన ఈ సమావేశానికి వివిధ కాలనీలు, అపార్ట్మెంట్ల అధ్యక్షులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా సైబర్ నేరాల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు సూచించారు. అపరిచిత లింకులు, ఫోన్ కాల్స్, ఓటీపీ మోసాలు, ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలపై జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ముఖ్యంగా సోషల్ మీడియా, డిజిటల్ లావాదేవీల్లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునే విషయంలో అప్రమత్తత అవసరమని తెలిపారు.అలాగే మహిళల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీస్ శాఖ అందిస్తున్న భద్రతా సేవలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వినాయక్నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పాల్గొని మాట్లాడారు. ప్రజలు భద్రతా అంశాలపై మరింత చైతన్యంతో ఉండాలని, కాలనీల్లో భద్రతా చర్యలను బలోపేతం చేసేందుకు పోలీస్ శాఖకు సహకరించాలని ఆమె కోరారు.కాలనీ స్థాయిలో సీసీ కెమెరాల ఏర్పాటు, నైట్ పట్రోలింగ్, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా వంటి చర్యల ద్వారా భద్రతను మరింత మెరుగుపరచవచ్చని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు సమాజంలో మంచి మార్పుకు దోహదపడతాయని హాజరైనవారు అభిప్రాయపడ్డారు.
“మీ సురక్ష” అవగాహన సమావేశం.. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సుమతి



