దేశ అంతర్గత భద్రతలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లు నక్సలిజం, ఉగ్రవాద నిర్మూలనలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. దేశంలో శాంతి భద్రతలను దెబ్బతీసే శక్తులను ఎదుర్కొంటూ, తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నారని అన్నారు. ఈ పోరాటంలో వారి ధైర్యం, అంకితభావం, దేశభక్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ఈరోజు ఉదయం హర్యానాలోని గురుగ్రాం సీఆర్పీఎఫ్ అకాడమీలో జరిగిన 56వ బ్యాచ్ గెజిటెడ్ అధికారుల స్నాతకోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, అకాడమీ డైరెక్టర్ అమిత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తొలుత అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి అంజలి ఘటించిన కేంద్ర మంత్రి అనంతరం స్నాతకోత్సవ వేడుకలను తిలకించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ CRPF 56వ బ్యాచ్ శిక్షణార్థి అధికారుల స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన స్నాతకోత్సవ పరేడ్ సీఆర్పీఎఫ్ అత్యున్నత స్థాయి క్రమశిక్షణకు ప్రతీకగా నిలుస్తోంది.
పరేడ్లో పాల్గొన్న అధికారులు 52 వారాల కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని విధులకు సిధ్ధమవడంవ సంతోషం. మాతృభూమికి సేవ చేయడానికి తమను తాము అంకితం చేసుకోవడం కంటే గొప్ప కర్తవ్యం మరొకటి లేదు. దేశసేవ అనే పవిత్ర ప్రతిజ్ఞే అత్యున్నత కర్తవ్య నిబద్ధతకు సంకేతమన్నారు.
సీఆర్పిఎఫ్ దేశంలోని అతిపెద్ద సాయుధ పోలీస్ దళం. దేశంలో అంతర్గత భద్రతను కాపాడటంలో ఈ దళం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. రాబోయే కాలంలో మీరందరు ఈ బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తారని నాకు విశ్వాసం ఉంది.
జమ్మూ-కాశ్మీర్, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించడంలో ఈ దళం కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలో అంతర్గత భద్రతకు సంబంధించిన ఈ సవాళ్లను ఎదుర్కొనడానికి ఈ దళానికి దృఢమైన నాయకత్వం అవసరం. శిక్షణ పొందిన అధికారుల నుండి ఇదే ఆశిస్తున్నాం.



