నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సవాల్ విసిరారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.
రాంచందర్ రావు మాట్లాడుతూ, కేరళ రాష్ట్రంలో 20 లోక్సభ స్థానాలు ఉండగా తెలంగాణలో కేవలం 17 స్థానాలే ఉన్నాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని భావిస్తే, మొదట కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కేరళలో లోక్సభ స్థానాలను తగ్గించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేయాలని సవాల్ చేశారు.
గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలకు తక్కువ ప్రాతినిధ్యం కల్పించిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం డీలిమిటేషన్ అంశాన్ని రాజకీయ లాభనష్టాల దృష్టితో కాంగ్రెస్ ప్రస్తావిస్తోందని అన్నారు. నిజంగా ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే, గతంలో జరిగిన అసమానతలపై కూడా స్పందించాలని పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ల అమలుపై కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టత లేని వైఖరిని ప్రదర్శిస్తోందని రాంచందర్ రావు విమర్శించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొత్త పార్లమెంటు భవనంలో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని, డీలిమిటేషన్ చేపట్టాలని కోరారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఆ ప్రక్రియను వ్యతిరేకించడం విరుద్ధంగా ఉందని మండిపడ్డారు.
ప్రస్తుతం 543 లోక్సభ స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ కోరడం విచిత్రమని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరగకుండా మహిళా రిజర్వేషన్ అమలు చేయడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాన ప్రాతినిధ్యం కోసం డీలిమిటేషన్ అవసరమని పేర్కొన్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడం వల్ల జనాభా వృద్ధి నియంత్రితమైందని, ఉత్తరాది రాష్ట్రాల్లో అలా జరగలేదని కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ వాదనలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఆరోపించారు.
భారతదేశంలో సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకు డీలిమిటేషన్ ఒక రాజ్యాంగ ప్రక్రియ అని, దీనిని ప్రాంతీయ భావోద్వేగాలతో ముడిపెట్టడం తగదని రాంచందర్ రావు అన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కొత్త వాదనలు తెరపైకి తీసుకువస్తోందని విమర్శించారు.
డీలిమిటేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని, బీజేపీ మాత్రం రాజ్యాంగబద్ధమైన విధానాల ద్వారా సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. మహిళా సాధికారత, సమాన రాజకీయ అవకాశాల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని చెప్పారు.



