ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల అమలు, రాజధాని అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతికి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూనే, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చకపోవడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్కు రాజధాని విషయంలో గత 12 ఏళ్లుగా స్పష్టత లేకపోవడం బాధాకరమని అన్నారు. అమరావతిపై నిరంతరం మారుతున్న నిర్ణయాలు పెట్టుబడిదారుల్లో అనిశ్చితిని పెంచాయని తెలిపారు. ఈ అస్పష్టత కారణంగా రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయని ఆమె విమర్శించారు.
అలాగే విభజన చట్టం కింద ఇచ్చిన పలు హామీలు అమలులోకి రాకపోవడం ప్రజలకు నష్టం కలిగించిందని అన్నారు. ముఖ్యంగా దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు విషయంలో కేంద్రం ఇచ్చిన హామీ ఇంకా నెరవేర్చలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.“బిల్లులు ప్రవేశపెట్టడం ఒక్కటే సరిపోదు. సమయానికి రాజధానిని నిర్మించి చూపించాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేయాలి” అని రేణుకా చౌదరి అన్నారు.రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కీలక పాత్ర పోషించాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటివరకు విభజన చట్టంలోని అనేక అంశాలు అమలు కాకపోవడం ఆందోళన కలిగించే విషయమని తెలిపారు.
ఇప్పటివరకు హామీలు ఎందుకు నెరవేర్చలేదో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే భవిష్యత్తులో అయినా ఈ హామీల అమలుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని కోరారు.రాజధాని అమరావతి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాల్లో ప్రభుత్వం స్పష్టమైన దిశానిర్దేశంతో ముందుకు సాగాలని ఆమె సూచించారు.



