తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఈరోజు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా గాలివేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశముండటంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతులు, ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రేపు కూడా వాతావరణ పరిస్థితులు తీవ్రంగానే ఉండే అవకాశం ఉందని, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలకు మళ్లీ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.హైదరాబాద్ నగరంలో కూడా వాతావరణం మేఘావృతంగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈరోజు, రేపు నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. నగర ప్రజలు బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
వడగళ్ల వానలు, ఈదురు గాలుల కారణంగా పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బతినే అవకాశం ఉన్నందున వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలని అధికారులు సూచించారు.ఇక మెరుపులతో కూడిన వర్షాల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, ఓపెన్ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. విద్యుత్ పరికరాల వినియోగంలో కూడా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు.



