వయసు ధృవీకరణ పత్రాల్లో అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో బెంగాల్ లెగ్ స్పిన్నర్, భారత అండర్-19 జట్టు ఆటగాడు రోహిత్ యాదవ్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కఠిన చర్యలు తీసుకుంది. అతడిపై రెండేళ్ల నిషేధం విధించినట్లు సమాచారం. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) సీజన్కు ముందు నిర్వహించిన వయసు ధృవీకరణ ప్రక్రియలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
19 ఏళ్ల రోహిత్ యాదవ్ ఇటీవల శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత అండర్-19 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాకుండా త్వరలో ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు వన్డేలు, రెండు రోజుల మ్యాచ్ల సిరీస్కు కూడా అతడిని ఎంపిక చేశారు. అయితే వయసు ధృవీకరణ సందర్భంగా అతడి పత్రాల్లో మూడు వేర్వేరు పుట్టిన తేదీలు ఉన్నట్లు CAB గుర్తించింది. ఈ పత్రాల్లో పేర్కొన్న వయసుల మధ్య ఏకంగా 27 నెలల వరకు వ్యత్యాసం ఉన్నట్లు తేలింది.
ఈ అవకతవకలు గుర్తించిన వెంటనే రోహిత్ యాదవ్ను ఆస్ట్రేలియా సిరీస్ నుంచి తప్పించారు. ఈ విషయాన్ని బీసీసీఐకి అనుబంధంగా ఉన్న ఇతర రాష్ట్ర క్రికెట్ సంఘాలకు కూడా CAB సమాచారం అందించింది. అనంతరం బీసీసీఐ నిబంధనల ప్రకారం అతడిపై రెండేళ్ల నిషేధం విధించినట్లు తెలుస్తోంది.రోహిత్ యాదవ్ వ్యవహారంతో పాటు వయసు వివరాల్లో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన మరో 64 మంది యువ క్రికెటర్లపై కూడా బెంగాల్ క్రికెట్ సంఘం చర్యలు తీసుకుంది. దీంతో మొత్తం 65 మంది క్రికెటర్లు ఈ వ్యవహారంలో నిషేధానికి గురైనట్లు సమాచారం.ఈ జాబితాలో 2022 అండర్-19 ప్రపంచకప్ విజేత భారత క్రికెటర్ రవికుమార్ పేరు కూడా ఉండటం గమనార్హం. బెంగాల్ సీనియర్ జట్టులో 2022లో అరంగేట్రం చేసిన ఎడమచేతి వాటం పేసర్ రవికుమార్ వయసు వివరాల్లో కూడా భారీ వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. అతడి వయసులో 40 నెలలకు పైగా తేడా ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో అతడి అరంగేట్రం నుంచి 2025-26 సీజన్ వరకు ఉన్న వయసు సంబంధిత రికార్డులను చెల్లనివిగా ప్రకటించినట్లు తెలుస్తోంది.
భారత జూనియర్ క్రికెట్లో వయసు మోసాలు చాలా కాలంగా ఆందోళన కలిగిస్తున్న అంశంగా ఉన్నాయి. ముఖ్యంగా అండర్-19 స్థాయిలో సరైన వయసు కంటే తక్కువ వయసుగా చూపించి పోటీల్లో పాల్గొనే ప్రయత్నాలను అరికట్టేందుకు బీసీసీఐ నిబంధనలను కఠినతరం చేసింది.ఈ సమస్యను ఎదుర్కొనేందుకు బీసీసీఐ 2020లో ఆటగాళ్లు తమ అసలు పుట్టిన తేదీలను స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ప్రత్యేక వెసులుబాటు పథకాన్ని కూడా తీసుకొచ్చింది. అయితే నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉద్దేశపూర్వకంగా తప్పుడు వయసు వివరాలు సమర్పించే ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో స్పష్టం చేసింది.
అండర్-19 ఆటగాళ్ల వయసు నిర్ధారణ ప్రక్రియలో జనన ధృవీకరణ పత్రంతో పాటు పాఠశాల లేదా కళాశాల విద్యా రికార్డులను సమర్పించడం కూడా తప్పనిసరి చేసింది. తాజా చర్యలతో జూనియర్ క్రికెట్లో వయసు మోసాలకు పాల్పడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే విషయంలో బీసీసీఐ మరోసారి కఠిన సంకేతాలు ఇచ్చినట్లయింది.




