రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రతరం అయిందని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శనివారం గన్పార్క్ వద్ద నిరసనకు దిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ఖాళీ యూరియా బస్తాలను మోసుకొచ్చి అమరవీరుల స్థూపం వద్ద తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “ప్రభుత్వం కనీసం 15 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలి. ఏ అంశంపైనైనా చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం” అని సవాల్ విసిరారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలపై చర్చించకుండా తప్పించుకుంటోందని ఆయన విమర్శించారు. “గత 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో ఎప్పుడూ ఎరువుల కొరత రాలేదు. రైతులు క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి లేకుండా చూసాం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు చెప్పులు, ఆధార్ కార్డులు లైన్లలో పెట్టే దుస్థితి ఎందుకొచ్చింది?” అని ఆయన ప్రశ్నించారు.
పండుగ రోజున కూడా రైతులు వర్షంలో తడుస్తూ ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్నారన్న ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 600 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, 75 లక్షల మంది రైతులు కష్టాల్లో ఉన్నారని ఆయన తెలిపారు. వ్యవసాయ సంక్షోభం నుంచి ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు వైఫల్యం వరకు అన్నింటిపై అసెంబ్లీలో విస్తృత చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై పీసీ ఘోష్ కమిషన్ను ప్రస్తావిస్తూ, “అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, కాంగ్రెస్ వేసుకున్న పీసీసీ ఘోష్ కమిషన్” అని ఎద్దేవా చేశారు. ఆ కమిషన్ విషయమై కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.అసమ్మతి ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ జరగాలని, అందుకు అనుగుణంగా అసెంబ్లీ సమావేశాల వ్యవధిని పెంచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.




