పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి తీసిన “యూనివర్సిటీ” చిత్రాన్ని నేపథ్యంగా తీసుకుని, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ రాష్ట్ర ముఖ్యమంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు. సామాజిక సందేశాలతో కూడిన సినిమాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం, వాణిజ్య లక్ష్యాలతో నిర్మితమవుతున్న చిత్రాలకు మాత్రం పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు.
“యూనివర్సిటీ” సినిమాలో ప్రశ్నాపత్రాల లీకేజీ వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆర్. నారాయణమూర్తి గొప్పగా ఆవిష్కరించారని నారాయణ పేర్కొన్నారు. “ప్రభుత్వ సహాయం నాకు అక్కర్లేదు” అని చెప్పే నారాయణమూర్తి లాంటి వ్యక్తిని చూసి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
వాణిజ్య చిత్రాలకు ప్రోత్సాహం… సందేశాత్మక చిత్రాలకు నిర్లక్ష్యమా?
“కోట్ల రూపాయలతో తీసే సినిమాలకు — పవన్ కళ్యాణ్ సినిమాకు, పుష్పకు, బాహుబలి లాంటి చిత్రాలకు మీరు రాయితీలు ఇస్తున్నారు. టికెట్ ధరలు పెంచుకోమంటున్నారు… బ్లాక్లో అమ్ముకోమంటున్నారు. ఇదేంటి దివాలాకోరు రాజకీయం?” అని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమాజానికి ఉపయోగపడే సినిమాలు నిర్లక్ష్యానికి గురవుతుంటే, హింసను ప్రోత్సహించే చిత్రాలకు ప్రభుత్వ మద్దతు ఇవ్వడం బాధాకరమని అన్నారు. “ఎర్రచందనం అమ్ముకోండి, బ్లాక్ మనీ చేసుకోండి, చంపుకోండి అనే విధంగా ఉండే చిత్రాలకు రాయితీలు… కానీ సమాజాన్ని మారుస్తున్న సినిమాలకు మాత్రం ఏ మద్దతు లేదు. ప్రజలు దీన్ని అసహ్యించుకుంటున్నారు” అని ధ్వజమెత్తారు.
సినిమా ఒక శక్తివంతమైన సాధనం అని చెప్పుకుంటూ, దాని వాస్తవ ప్రయోజనాలను పట్టించుకోకపోవడం ప్రభుత్వాల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని నారాయణ విమర్శించారు.




