రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాల్లో నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవడంలో మంత్రి నారా లోకేష్ మరొకసారి తన మానవీయతను చాటుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం కామిరెడ్డిపల్లికి చెందిన దాసరి నరసింహులు కుటుంబాన్ని ఉండవల్లి నివాసానికి ఆహ్వానించి వారి బాధలు విన్నారు. ఫ్యాక్షన్ దాడిలో కుటుంబాన్ని కోల్పోయిన బాధితులకు మద్దతుగా నిలిచారు.
2011లో ఫ్యాక్షన్ రాజకీయాల పర్యవసానంగా బోయ నరసింహులు, అతని కుమారుడు, కుమార్తెలను దారుణంగా హత్య చేసిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నందుకే ఈ దాడి జరిగినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అప్పట్లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ కుటుంబానికి అండగా నిలిచారు. తాజాగా మంత్రి లోకేష్ వారి వద్దకు వెళ్లడం, సమస్యలు అడిగి తెలుసుకోవడం ఆయనకు ప్రత్యేకతనిచ్చింది.
చిన్నారి మృత్యుంజయుడితో హృదయాన్ని తాకిన సన్నివేశం
ఆ హత్యాకాండ జరిగిన సమయంలో బోయ నరసింహులు మనవడు, అప్పటికి కేవలం రెండు నెలల చిన్నారి అయిన మృత్యుంజయుడు ప్రాణాలతో తప్పించుకున్నాడు. ప్రస్తుతం విద్యాభ్యాసంలో ఉన్న మృత్యుంజయుడిని మంత్రి లోకేష్ ప్రేమగా పలకరించారు. అతని చదువు వివరాలు తెలుసుకుని, మెరుగైన భవిష్యత్తు కోసం ప్రోత్సహించారు. “బాగా చదువుకుని ఉన్నతస్థాయికి చేరాలి. మీ కుటుంబానికి నేను అన్నివిధాలుగా అండగా ఉంటాను” అని హామీ ఇచ్చారు.
కృతజ్ఞతలు తెలిపిన బోయ కుటుంబం
మంత్రి నారా లోకేష్ సానుభూతి, అండకు బోయ నరసింహులు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. “ఏ బాధితుడూ ఒంటరిగా ఉండకూడదు అన్న భావనతో నారా లోకేష్ గారు చేసిన ఈ అడుగు మాకు మానసికంగా ఎంతో బలాన్ని ఇచ్చింది” అని వారు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మనోభావాలను అర్థం చేసుకుంటూ, సమస్యల పరిష్కారానికి ముందుంటున్న మంత్రి లోకేష్, ఈ ఉదాహరణ ద్వారా ప్రజల హృదయాల్లో మరింత స్థానం సంపాదించారు.




