GHMC ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న QC ఇంజినీర్ల పనితీరుపై మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ తీవ్రంగా మండిపడ్డారు. అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాల్సిన సమయంలో QC ఇంజినీర్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణలేమితో పనులు నిలిచిపోతున్నాయని ఆరోపించారు.
కొత్త ప్రతిపధనలను ప్రారంభించేందుకు QC ఇన్స్పెక్షన్ తప్పనిసరి చేశారని, కానీ వారు సమయానికి సైట్ పరిశీలన చేయకపోవడంతో పనుల ప్రారంభానికి రోజుల తరబడి ఆలస్యం జరుగుతోందని అన్నారు. చివరికి ఫైళ్లను వారి వద్దకు పంపించి సంతకాలు తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడిందని వివరించారు.
అర్ధం లేని విధానాలతో అభివృద్ధికి బ్రేకులు
“ఇది పూర్తిగా పనికి రాని వ్యవస్థ. QC ఇంజినీర్లకు GHMC పాలసీలపై తగిన అవగాహన కూడా లేదు. పనులు పూర్తైన తర్వాత కూడా ముడుపులు చెల్లించక తప్పడం లేదు,” అని శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
లక్షల రూపాయల భారం – పనితీరు మాత్రం తక్కువే
ప్రతి QC ఇంజినీర్కు సగటున రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు GHMC ఖర్చు చేస్తున్నప్పటికీ, వారు చేసే పని చాలా తక్కువగా ఉందని విమర్శించారు. ప్రజాధనం వృథాగా మారుతోందని ఆయన స్పష్టం చేశారు.
QC వ్యవస్థ రద్దు – పూర్తి బాధ్యత DE, SEలకు
ఈ నేపథ్యంలో GHMCలో QC వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, అభివృద్ధి పనుల బాధ్యతను పూర్తి స్థాయిలో DEలతో పాటు SEలకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
“ప్రజల అభివృద్ధికి అడ్డుగోడలు వేసే విధానాలన్నింటినీ ఖండిస్తూ, వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను,” అని కార్పొరేటర్ శ్రవణ్ స్పష్టం చేశారు.




