పేర్ని నాని చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక నిగూఢ రాజకీయ కుట్ర దాగి ఉందని, దీనివల్ల టీడీపీని టార్గెట్ చేసి, కొడాలి నాని, వల్లభనేని వంశీలను అరెస్ట్ చేయించి… తన కుమారుడికి కృష్ణా జిల్లాలో ఆధిపత్యాన్ని అప్పగించాలన్న కుట్ర పన్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
“పేర్ని నాని మాట్లాడే భాష దిగజారినది – వెంటనే క్షమాపణలు చెప్పాలి”
వైసీపీ నేతలు విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని, ముఖ్యంగా పేర్ని నాని వాడిన భాష అసహ్యతకు నిదర్శనమని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. “పదవిలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ జైలు చుట్టూ తిరిగాడు, ఇప్పుడు పేర్ని నాని అదే మార్గంలో నడుస్తున్నాడు. శాసనసభలో జగన్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చి చదివించేవాడు, ఇప్పుడు అదే పని పేర్ని చేస్తున్నాడు” అని విమర్శించారు.
“76 ఏళ్ల చంద్రబాబును అవమానించాలా?”
పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ సోమిరెడ్డి… “చంద్రబాబు గారికి వయసు మీద పడిందని తక్కువ చేస్తావా? ఆయన అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుండి బ్రతికిన నాయకుడు. రామతీర్థం, అలిపిరి కొండలు ఎక్కిన వారితో నీవు పోల్చుకోగలవా? ఆయన వంటి సీనియర్ నాయకుడిపై నీకు మాట్లాడే అర్హత ఉందా?” అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా “నోరు అదుపులో పెట్టుకో, చంద్రబాబు పేరు వినగానే వణికే నువ్వు మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడాలి” అని హెచ్చరించారు.
“రప్పా రప్పా… సినిమా తీయించండి”
వైసీపీ నాయకుల తీరుపై సెటైర్లు వేసిన సోమిరెడ్డి… “రప్పా రప్పా అంటూ గంగమ్మ జాతరను రాజకీయ నాటకంగా మలచే నాయకులతో జగన్ సినిమా తీయించాలి. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చేత ‘రప్పా రప్పా’ అనే బూతు సినిమా తీయించండి” అన్నారు. వైసీపీ నాయకులు రాష్ట్ర రాజకీయాలను దిగజారుస్తున్నారని, ప్రజలలో రాజకీయాల పట్ల విరక్తి పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
“జగన్ రెడ్డి వ్యక్తిగత చరిత్రే రక్త చరిత్ర”
“జగన్ రెడ్డి పాలనలో కుటుంబాలపై వ్యక్తిగత దాడులు మామూలు అయిపోయాయి. బాబాయిని చంపడం, తల్లిని, చెల్లిని గెంటేయడం… ఇవే ఆయన గొప్పలు. వల్లభనేని వంశీ, కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటి నేతలు కుటుంబాలపై దూషణలకు దిగుతున్నారు. వైసీపీని నైతికంగా నాశనం చేసిన నాయకుడు జగన్ రెడ్డి” అని సోమిరెడ్డి మండిపడ్డారు.
“చట్టం తన పని తాను చేస్తోంది – కక్షల రాజకీయాలు లేవు”
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరమైన వ్యవస్థలు గాడిలో పడ్డాయని, ఎవరు తప్పు చేసినా చట్టం కఠినంగా స్పందిస్తుందని స్పష్టం చేశారు. “తప్పు చేసిన వాళ్లెవరైనా శిక్ష తప్పదు. అది వల్లభనేని వంశి అయినా, ప్రసన్నకుమార్ రెడ్డి అయినా చట్టం ముందు సమానమే. కానీ పేర్ని నాని మాట్లాడిన విధంగా మిగిలిన వైసీపీ నేతలు మాట్లాడితే పరిస్థితులు మరింత దిగజారతాయి. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పకపోతే ప్రజలు వైసీపీని తేలిగ్గా వదిలిపెట్టరు” అని హెచ్చరించారు.




