GHMC అధికారాలపై హైడ్రా ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సీటు వద్ద కొబ్బరికాయ కొట్టి, అరటిపళ్ళ నైవేద్యం పెట్టిన ఆయన… GHMC అధికారుల మూగ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ, “GHMC అధికారాలను మెల్లమెల్లగా హైడ్రాకు బదిలీ చేస్తూ MET, నాలా, డిజాస్టర్ రెస్పాన్స్ వంటి కీలక పనులను GHMC పక్కన పెట్టింది. ఫలితంగా నగరంలో గుంతలు, రోడ్లపై నిలిచిన నీరు అలాగే ఉన్నాయి. అధికారాల మధ్య స్పష్టత లేక నగర వాసులు తీవ్రంగా నష్టపోతున్నారు” అని తెలిపారు.
అలాగే, పాతబస్తీలో కోట్ల రూపాయల మతపరమైన శాంక్షన్లు ఒక వర్గానికి ఇవ్వగలిగిన GHMC, కొత్త నగరంలో బోనాలు, వినాయక చవితి, బతుకమ్మ వంటి హిందూ పండుగలపై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
“GHMC ఆదాయంలో పెద్ద భాగం వచ్చే కొత్త నగర ప్రాంతాలకు అన్యాయం జరుగుతుండటం బాధాకరం. ముఖ్యమంత్రి అనుచరులకు, MIMకు నిధులు లభించగలిగితే, హిందూ పండుగలకు ఎందుకు చేతులు వంకరిస్తున్నారు?” అని ప్రశ్నించారు.
అధికారులను ప్రశ్నించేందుకు వచ్చినప్పుడు మీడియాను నిర్బంధించడం, ప్రజల ఫోన్లను స్వీకరించకపోవడం దారుణమని మండిపడ్డారు. సర్కిల్ డీసీ, జోనల్ కమిషనర్లు, GHMC కమిషనర్ లు అందుబాటులో లేకపోవడాన్ని ఖండించారు. డబ్బుల ప్రలోభంతో GHMC అధికారుల బదిలీలు జరగడం, వాటిపై సమీక్ష జరగకపోవడం హిందువుల పట్ల అన్యాయాన్ని చూపుతోందని అన్నారు.
“ఈ వైఖరి మార్చుకోకపోతే, తీవ్ర పరిణామాలు తప్పవు” అని హెచ్చరిస్తూ, మల్కాజ్గిరి ప్రజల తరఫున ఇది ప్రారంభమైన పోరాటమని స్పష్టం చేశారు.




