తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. గత పదేళ్లలో కేంద్రం తెలంగాణకు రూ. 12 లక్షల కోట్ల నిధులు విడుదల చేసిందని, కేవలం గత రెండేళ్లలోనే రూ. 1.5 లక్షల కోట్లను కేటాయించిందని ఆయన గణాంకాలతో వివరించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నిజాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మీడియాతో మాట్లాడిన రాంచందర్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్లను నేరుగా సవాల్ చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చించేందుకు వారు ఎప్పుడు సిద్ధమో చెబితే తాను ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ అంశంపై ప్రజల ముందు నిజానిజాలు బయటపెట్టాలని ఆయన స్పష్టం చేవారు.
హరీశ్ రావు ఢిల్లీకి వెళ్లింది కేవలం కాళేశ్వరం కేసుకు సంబంధించిన చట్టపరమైన సలహాల కోసమేనని, బీజేపీతో ఎలాంటి రహస్య చర్చలు జరపడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై వస్తున్న ఊహాగానాలకు ఆయన తెరదీశారు.
కాళేశ్వరంప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చైన ఈ ప్రాజెక్టులో జరిగిన లోపాలను వెలికితీయడం ఎంతైనా అవసరముందన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం కేవలం నాణ్యత లోపాలు ఉన్న బ్యారేజీలపై మాత్రమే విచారణ కోరడం సరిపోదని ఆయన విమర్శించారు. మొత్తం ప్రాజెక్టుపై సమగ్రంగా సీబీఐ విచారణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు.
రాంచందర్ రావు వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్రం వినియోగం, ప్రాజెక్టుల పారదర్శకత వంటి అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.



