మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత కే చంద్రశేఖర్ రావు కు చెందిన గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఆరోపించారు.హరీశ్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు అధికార మదంతో వ్యవహరిస్తూ పట్టపగలే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజాప్రతినిధుల కార్యాలయాలపైనే దాడులు జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రశ్నార్థకంగా మారుస్తోందన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందా అనే సందేహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ దాడులు జరుగుతున్నాయన్న అనుమానం వ్యక్తం చేస్తూ, ఇది ప్రజాస్వామ్యానికి ముప్పని వ్యాఖ్యానించారు. ఒకవైపు ‘హేట్ స్పీచ్ బిల్’ పేరుతో ప్రతిపక్షాల స్వరాన్ని అణచివేస్తూ, మరోవైపు ఇలాంటి దాడులు చేయించడం ద్వంద్వ వైఖరి అని ఆరోపించారు.“ఇందిరమ్మ రాజ్యం పేరుతో గూండా రాజ్యం నడుపుతున్నారా?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హరీశ్ రావు, రాష్ట్రంలో చట్టవ్యవస్థ క్షీణిస్తోందని విమర్శించారు. సీఎం మరియు మంత్రులు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉండగా, రాష్ట్ర పాలనను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేయడానికి కాంగ్రెస్ నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లుగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ విధమైన చర్యలు కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి మరింత పెరుగుతుందని హెచ్చరించారు.కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేతలకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ లొంగదని స్పష్టం చేసిన హరీశ్ రావు, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కొనసాగిస్తామని తెలిపారు. గజ్వేల్లో జరిగిన దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని డీజీపీని డిమాండ్ చేశారు.



