హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో 99వ జయంతి సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ, దొడ్డి కొమరయ్య చేసిన త్యాగాలను ప్రతి తరానికి పరిచయం చేయడం మన బాధ్యత అని అన్నారు. ఏ కులం అయినా, ఏ జాతి అయినా తమ చరిత్రను, త్యాగాలను గుర్తుంచుకోకపోతే రాబోయే తరాలకు అవి తెలియవని పేర్కొన్నారు.నిజాం పాలనలో దోపిడి, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన మహనీయుడు దొడ్డి కొమరయ్య అని ఆయన గుర్తుచేశారు. అటువంటి గొప్ప నాయకుల త్యాగాలను గుర్తుచేసుకోవడం ద్వారా సమాజంలో చైతన్యం పెరుగుతుందని అన్నారు.
అలాగే చుక్క సత్తన్న గురించి ప్రస్తావిస్తూ, ఆయన ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. చుక్క సత్తన్న కథలు చెప్పినప్పుడు అన్ని కులాల వారు ఆసక్తిగా వినేవారని తెలిపారు.కురుమ జాతి తమ సంస్కృతి, సంప్రదాయాలను ఇప్పటికీ గౌరవంగా కొనసాగించడాన్ని ఈటల రాజేందర్ ప్రశంసించారు. మారుతున్న కాలంలో కూడా తమ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగుతున్న ఈ జాతి మరింత ఐక్యతతో, పట్టుదలతో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వెంకటేష్కు ఈటల రాజేందర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో చరిత్రపై అవగాహన పెంచేందుకు దోహదం చేస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో సామ రంగారెడ్డి, జాజుల శ్రీనివాస్ గౌడ్, కొప్పుల నరసింహారెడ్డి, శ్యామ్, ఆదికృష్ణ, వెంకన్న, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై దొడ్డి కొమరయ్యకు నివాళులర్పించారు.



