Saturday, June 6, 2026
Google search engine

నేను సౌమ్యుడిని కాదు.. పోరాటయోధుడిని

Must read

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే పార్టీ యొక్క ప్రధాన లక్ష్యమని, అందుకోసం ప్రతి కార్యకర్త ప్రగాఢంగా పని చేయాలని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.

‘‘గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరడం మా లక్ష్యం. తెలంగాణలో ప్రజాస్వామ్యబద్ధమైన, వికసిత పాలనను బీజేపీద్వారానే సాధించవచ్చు’’ అని రామచందర్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి నేతల సహకారం తమకు ఉండబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

పార్టీలో అందరికీ సమాన స్థానం

‘‘ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం గర్వంగా ఉంది. అయినప్పటికీ, నేను ఒక నాయకుడిగా కాదు, కార్యకర్తగానే పనిచేస్తాను. పార్టీలో కొత్త, పాత అనే తేడాలుండవు. ప్రతి సభ్యుడూ బీజేపీ కుటుంబంలో భాగమే. యువత, మహిళలు అధికంగా చేరాలి. కొత్త రక్తంతో పార్టీకి జీవం పోసేలా చూస్తాం,’’ అని ఆయన పేర్కొన్నారు.

సౌమ్యుడిగా కాదు, పోరాటయోధుడిగా

తనపై ఉన్న అభిప్రాయాలపై స్పందించిన రామచందర్ రావు, ‘‘కొందరు నన్ను సౌమ్యుడిగా అభివర్ణిస్తున్నారు. కానీ నిజం అది కాదు. విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై పోరాడుతున్నాను. 14 సార్లు జైలుకు వెళ్లాను. లాఠీ దెబ్బలు తిన్నాను. ప్రభుత్వ వైఖరిపై నా పోరాటం ప్రజాస్వామ్య పద్ధతుల్లో కొనసాగుతుంది. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఎక్కడికైనా వెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నాను,’’ అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌పై ఘాటుగా

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన రామచందర్ రావు, ‘‘కాంగ్రెస్ ఒక ఫేక్ న్యూస్ యూనివర్సిటీగా మారింది. సోషల్ మీడియా వేదికగా బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారాలు చేస్తోంది. కార్యకర్తలు వారిపై సమర్థంగా స్పందించి నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి,’’ అని పిలుపునిచ్చారు.

స్థానిక ఎన్నికలపై దృష్టి

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుభి మోగించేందుకు ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి బీజేపీ సిద్ధాంతాలను చాటాలని ఆయన సూచించారు. ‘‘ఈ రోజు బీజేపీ ఈ స్థాయికి చేరడం అనేక నేతలు, కార్యకర్తల త్యాగాల ఫలితం. వారి ఆశయాలను సాకారం చేయడం మనందరి బాధ్యత,’’ అని రామచందర్ రావు పేర్కొన్నారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!