పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'బ్రో' ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. మూడు రోజుల్లోనే ఈ చిత్రం దాదాపు రూ. 100 కోట్లను సాధించిందనే సమాచారం వస్తోంది. మరోవైపు ఈ సినిమా కలెక్షన్లపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైరిక్ గా ట్వీట్ చేశారు. 'ప్రొడ్యూసర్ కి కలెక్లన్లు నిల్లు... ప్యాకేజీ స్టార్ కి పాకెట్ ఫుల్లు' అంటూ ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్ ను పవన్ కల్యాణ్ కు, నిర్మాత విశ్వప్రసాద్ కు ట్యాగ్ చేశారు. అంబటి చేసిన తాజా ట్వీట్ పై పవన్ అభిమానులు, జనసైనికులు మండిపడుతున్నారు.  

మరోవైపు, ఈ చిత్రం విడుదలయినప్పటి నుంచి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. గత భోగి పండుగ సందర్భంగా అంబటి రాంబాబు డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. అవే స్టెప్పులను పోలిన విధంగా ఈ సినిమాలో పృథ్వీ చేత డ్యాన్స్ చేయించారు. దీనిపై అంబటి ఇప్పటికే విమర్శలు గుప్పించారు. దీనిపై పృథ్వీ స్పందిస్తూ... అంబటి ఆస్కార్ నటుడేమీ కాదని... ఆయనను అనుకరించాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. జనసేన పార్టీ అవకాశం ఇస్తే సత్తెనపల్లి నుంచి పోటీ చేసి అంబటిని ఓడిస్తానని అన్నారు.