అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రామమందిరం జనవరి 22న ప్రారంభం కానుంది. సుమారు ఆరు వేల మంది అతిథుల మధ్య ప్రాణ ప్రతిష్ట ఆలయ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అయోధ్య నుంచి ఆహ్వానం అందింది. శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా చిరంజీవికి విశ్వహిందూ పరిషత్ జాతీయ డైరెక్టర్ గుర్రం సంజీవ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ శశిధర్ రావినూతల ఆహ్వానపత్రిక అందించారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. శతాబ్దాల నిరీక్షణ ఫలితంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం, రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగిందన్నారు. ఇలాంటి చారిత్రాత్మక కార్యక్రమంలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన రామజన్మభూమి ఫౌండేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చిరంజీవి అన్నారు. ఇంత పెద్ద కార్యక్రమంలో తాను పాల్గొంటున్నట్లు వివరించారు.