''దేశ నాయకుడిని ఎన్నుకునే అవకాశం ప్రజల చేతికి ఇవ్వడమే రిపబ్లిక్ వ్యవస్థ. అనేక మంది మహనీయుల త్యాగఫలం నేటి మన రిపబ్లిక్ భారతం. దేశ ప్రజల భవిష్యత్ బావుండాలి, భవిష్యత్ తరాలు ఉన్నంతగా వుండాలి, దేశం బలోపేతం కావాలనే గొప్ప ఉద్దేశంతో నాడు ఆ మహానీయలు త్యాగాలు చేస్తే.. నేడు బ్రతికుండి మనం దేశాన్ని, వ్యవస్థని బలహీన పరిచుకుంటున్నాం. ఎంతసేపు హక్కులు గురించి మాట్లాడుతున్నామే కానీ భాద్యతలు గుర్తిస్తున్నామా ?'' అని ప్రశ్నించారు ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. 73వ గణతంత్ర దినోత్సవం బాగంగా ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజిక వర్గంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన జెండావందనం వేడుకల్లో పాల్గొన్నారు దాసోజు. 

ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. 'ఓటువేయడానికి బద్దకించే స్థితిలో నేడు సమాజం వుంది. డబ్బుకు అమ్ముడుపోయి ఓటు వేసే పరిస్థితి. మద్యానికి, మాంసానికి, చిన్నచిన్న తాయిలాలకు, ప్రలోభాలకు లోబడి ఓటుని వాడుకుంటున్నాం. ఓటుని తాకట్టుపెడుతున్నాం. మన భాద్యతలని విస్మరిస్తున్నాం. తద్వార హక్కులు కోల్పోతున్నాం. నాడు మహనీయులు ప్రాణ త్యాగాలు దేశాన్ని బలోపేతం చేస్తే.. నేడు బ్రతికుండి భాద్యతలని విస్మరిస్తూ మనల్ని మనమే బలహీన పరుచుకుంటున్నాం. దేశాన్ని కూడా బలహీనపరుస్తున్నాం'' అని ఆవేదన వ్యక్తం చేశారు దాసోజు. 

'నేడు ప్రతి గల్లీలో జెండా ఎగరుస్తున్నాం. బాపూజీ, అంబేద్కర్ కి దండాలు వేస్తున్నాం. జైహింద్ నినాదాలు చేస్తున్నాం. జెండావందనం చేస్తున్నాం. ఇదే దేశభక్తి అని సంకలు గుద్దుకుంటున్నాం. కానీ అసలైన భాద్యతలని మాత్రం విస్మరిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, వాటికి మూలమైన ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలి ? అని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. భాద్యతలని విస్మరిస్తే హక్కులు నెరవేర్చచమనే అధికారం చేజారుతుందనే విషయాన్ని గ్రహించాలి '' అని కోరారు దాసోజు. 

''పెట్టుబాడి దారులు, రియలెస్టేట్ బ్రోకర్లు, క్రోనిక్ కాప్టిలిస్టులు నేడు రాజకీయాల్ని శాశిస్తున్న పరిస్థితి. రాజకీయం పెట్టుబడి వ్యాపారంగా మారింది. పాలక వర్గాలు వేసే ఎంగిలి మెతుకులకు కోసం ప్రజలు ఎదురుచూస్తున్న పరిస్థితి. ప్రజలు ఓట్లు వేసే యంత్రాలుగా మారిపోయారు. బానిసకొక బానిస అన్నట్లుగా పరిస్థితి మారింది. కాబట్టి జెండా వందనం అంటే జెండాకి, రాజ్యాంగానికి దండం పెట్టడం కాదు,, రాజ్యాంగంలో వున్న హక్కులతో పాటు భాద్యతలని గుర్తు చేసుకోని వాటిని నిర్వర్తించాలి. ఏ లక్ష్యంతో మహనీయులు ఆత్మత్యాగాలు చేశారో, ఏ లక్ష్యంతో రిపబ్లిక్ దేశం ఏర్పడిందో.. ఆ లక్ష్యం వైపుగా మనం నడుస్తున్నామా లేదా ? అనే ఆత్మ విమర్శ చేసుకోవాలి'' అని విజ్ఞప్తి చేశారు దాసోజు.