హైదరాబాద్ హైటెక్స్లో ఏర్పాటు చేసిన కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ “అమృత్”ను తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్ను ప్రారంభించిన మంత్రి, ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ యంత్ర పరికరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, హైదరాబాద్ హైటెక్స్ వేదికగా ఇలాంటి భారీ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఎగ్జిబిషన్ నిర్వహించడం సంతోషకరమని అన్నారు. భారీ నిర్మాణాలు, సివిల్ పనులు, వ్యవసాయ రంగానికి ఉపయోగపడే ఆధునిక యంత్ర పరికరాలను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని తెలిపారు.
దేశ విదేశాల్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ ప్రజలకు పరిచయం చేసేలా ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం మంచి ప్రయత్నమని మంత్రి పేర్కొన్నారు. నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం పెరగడం వల్ల పనుల వేగం, నాణ్యత మరింత మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు.సివిల్ వర్క్స్తో పాటు రైతులకు ఉపయోగపడే పరికరాలను కూడా ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం ప్రత్యేకత అని మంత్రి తెలిపారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా కొత్త అవకాశాలకు మార్గం ఏర్పడుతుందని అన్నారు.ఈ ఎగ్జిబిషన్ను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహక బృందానికి, ఇందులో పాల్గొంటున్న అన్ని కంపెనీలకు మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో పారిశ్రామిక సంస్థలు, సాంకేతిక రంగం, ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.




