ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మా రెడ్డి కృషి ఫలితంగా కాప్రా చెరువుకు మహర్దశ పట్టబోతోందని తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర నాయకులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కాప్రా కన్వీనర్ రేగళ్ల సతీష్ రెడ్డి అన్నారు. కాప్రా చెరువు సుందరీకరణ కోసం ప్రభుత్వం రూ.35 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కాప్రా చెరువు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఎన్నో రోజులుగా ప్రభుత్వంతో నిరంతరం పోరాడారని, ఆయన చొరవ వల్లే ఈ భారీ నిధులు మంజూరయ్యాయని రేగళ్ల సతీష్ రెడ్డి పేర్కొన్నారు.చెరువు సుందరీకరణ పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు మెరుగైన వాతావరణం, పారిశుద్ధ్య పరిస్థితులు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అభివృద్ధి పనులతో కాప్రా ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొని ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు.
కాప్రా చెరువుకు రూ.35 కోట్లతో మహర్దశ.. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి ఘన సన్మానం



