దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధిపత్యం మరింత బలపడుతుందని, రాబోయే రోజుల్లో పలు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, అస్సోం, పుదుచ్చేరి, ప్రాంతాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే విజయం సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో తెలంగాణాలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, పార్టీ రాష్ట్ర అగ్రనేతలు కీలక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణ, ప్రచార వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో రాష్ట్రంలోని పలు జిల్లాల నేతలు, కార్పొరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ముఖ్యంగాసైబరాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలోని సుమారు 300 డివిజన్ల నుంచి భారీగా ప్రజలను సభకు తరలించేందుకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి డివిజన్ నుంచి గరిష్ట స్థాయిలో జన సమీకరణ జరిగేలా కార్యాచరణ రూపొందించారు.
ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ, ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్కు వస్తున్నారని తెలిపారు. ఈ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ రాకతో తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారతాయని, ప్రజల్లో బీజేపీ పట్ల విశ్వాసం మరింత పెరుగుతుందన్నారు.
తెలంగాణలో బీజేపీ విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టిన పార్టీ నాయకత్వం, గ్రామస్థాయి నుంచి నగర స్థాయి వరకు సంస్థాగత బలాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కట్టుదిట్టమైన వ్యూహాలను అమలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మోదీ పర్యటన సందర్భంగా నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా, రాష్ట్రంలో బీజేపీ శక్తిని ప్రదర్శించాలని పార్టీ భావిస్తోంది. ఈ సభకు భారీగా ప్రజలు హాజరవుతారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మోదీ పర్యటనను రాజకీయంగా మలచుకుని తెలంగాణలో బీజేపీ బలాన్ని పెంచుకోవాలని పార్టీ యత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది.



