Saturday, June 6, 2026
Google search engine

అబద్ధాల ప్రచారంతో రైతులను మోసం చేసిన వైసీపీ :మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

Must read

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాల పునాది మీద నిలిచినవని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం రైతుకు వెన్నుదన్నుగా నిలిచి గిట్టుబాటు ధరలు, సమయానికి విత్తనాలు, ఎరువులు, నీటి పారుదల సదుపాయాలు అందిస్తూ వ్యవసాయాన్ని బలోపేతం చేస్తుంటే, వైసీపీ నేతలు మాత్రం వాస్తవాలను వక్రీకరించి అబద్ధాల ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు.

వైసీపీ పాలనలో రైతులు అప్పుల భారంతో నలిగిపోవడం, పంటలకు సరైన ధరలు దక్కక రోడ్డెక్కిన ఘటనలు ప్రజలు మర్చిపోలేదని, ఆ కాలంలో వ్యవసాయం క్షీణించి రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక MSP అమలులో కట్టుబడి ధరల స్థిరీకరణ నిధి (PSF) ద్వారా రైతులను ఆదుకుంటూ 2025–26లో రూ.300 కోట్ల కేటాయిస్తే సుమారు రూ.588 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

అందులో పోగాకు (రూ.240 కోట్లు), మామిడి (రూ.190 కోట్లు), ఉల్లి కొనుగోలు (రూ.17.20 కోట్లు), ఉల్లి నష్టపరిహారం (రూ.128.33 కోట్లు), కోకో (రూ.12 కోట్లు) వంటి పంటలకు ప్రత్యక్ష మద్దతు అందించామని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో కేటాయింపులు ఉన్నా ఖర్చు చేయకుండా తప్పుడు లెక్కలు చూపించి రైతులను మోసం చేశారని దుయ్యబట్టారు.

25 వేలు ఉన్న ఉల్లి నష్టపరిహారాన్ని హెక్టారుకు రూ.50 వేల వరకు పెంచి రైతులకు ఉపశమనం కల్పించామని, ప్రస్తుతం మొక్కజొన్న సమస్యపై కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో నిరంతరం చర్చలు జరుపుతూ రైతులకు అనుకూల నిర్ణయం తీసుకురాబోతున్నామని వెల్లడించారు.

2019–2024 మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి 143–175 లక్షల మెట్రిక్ టన్నుల మధ్యే నిలిచిపోయి 2023-24లో 143 లక్షల టన్నులకు పడిపోవడం వైసీపీ వైఫల్యాన్ని బట్టబయలు చేస్తుండగా, 2024 తర్వాత కూటమి పాలనలో 163 లక్షల టన్నుల నుంచి 2025-26లో 237 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగి సుమారు 51% వృద్ధి నమోదు కావడం వ్యవసాయ రంగంలో సంభవించిన మార్పుకు నిదర్శనమని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యాన రంగంలో కూడా చరిత్రాత్మక పురోగతి సాధిస్తున్నామని పేర్కొంటూ, మైక్రో ఇరిగేషన్‌లో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ మేరకు రాయలసీమను గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని, ఆయిల్ పామ్ సాగులో రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో ఉందని, కొత్త విస్తరణకు భారీ ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం, ఆదాయం పెంపు, వ్యవసాయ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని, వాస్తవాలు తెలుసుకోకుండా అబద్ధాలు ప్రచారం చేసే వైసీపీ నేతల మాటలను ప్రజలు తిప్పికొడతారని మంత్రి అచ్చెన్నాయుడు ఘాటుగా హెచ్చరించారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!