Friday, March 6, 2026
spot_imgspot_img

ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో డ్రైనేజ్ సమస్యలు, పంట నష్టాలపై అసెంబ్లీలో చర్చ

Must read

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ రాజోలు నియోజకవర్గంలో తీవ్రంగా నెలకొన్న డ్రైనేజ్ సమస్యలపై ప్రశ్నించారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల గత మరియు ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో సుమారు 6000 ఎకరాల్లో పంటలు మునిగిపోయి రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయన వెల్లడించారు. ప్రభావిత రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, సముద్ర మట్టం పెరుగుదల, భూమి కుంగిపోవడం మరియు డ్రైనేజ్ నీటిలో ఉప్పు శాతం పెరగడం వంటి కారణాల వల్ల సుమారు లక్ష ఎకరాలకు పైగా కొబ్బరి తోటలు దెబ్బతిన్నాయని, వేలాది కొబ్బరి చెట్లు ఎండిపోయి పాడైపోయాయని పేర్కొన్నారు. టెక్నికల్ కమిటీ నివేదికల ఆధారంగా ఈ సమస్యను ప్రకృతి విపత్తుగా గుర్తించి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. లైడార్ సర్వే కూడా జరుగుతోందని తెలిపారు.

దీనికి సమాధానంగా వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు స‌మాధాన‌మిస్తూ , ఉభయ గోదావరి జిల్లాల్లో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉందని అంగీకరించారు. గత ప్ర‌భుత్వంలో ఐదేళ్లుగా డ్రైనేజ్ అభివృద్ధికి ఒక్క పైసా కూడా నిధులు కేటాయించకపోవడం వల్ల పరిస్థితి మరింత విషమించిందని పేర్కొన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రాజెక్ట్ రూపంలో తీసుకుని సర్వే చేయడానికి రూ.17 కోట్లు విడుదల చేశామని, సర్వే పూర్తి చేసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్లి బ్యాంకుల సహకారంతో సమగ్ర చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కొబ్బరి తోటల నష్టంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, నిపుణుల బృందంతో పరిశీలించినట్లు మంత్రి తెలిపారు. రైతులకు తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
మల్కీపురం, మామిడికుదురు మండలాల పరిధిలోని కేసనపల్లి, శంకరగుప్తం తదితర గ్రామాల్లో పెద్దఎత్తున కొబ్బరి చెట్లు ఎండిపోయినట్లు నివేదికలు అందాయని పేర్కొన్నారు. దాదాపు ఒక లక్ష కొబ్బరి చెట్లు పాడైపోయిన నేపథ్యంలో, ప్రతి చెట్టుకు రూ.1,000 చొప్పున మొత్తం రూ.10 కోట్లు ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు సమర్పించిందని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపినట్లు వెల్లడించారు. దీర్ఘకాలిక పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం “శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ” పనులకు రూ.20.77 కోట్లు మంజూరు చేసిందని, ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అదనంగా, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా R&R (Replanting & Rejuvenation) పథకం కింద హెక్టారుకు రూ.32,500లు, అలాగే పాత మొక్కలు తొలగించడానికి కొత్త మొక్కలు వేయడానికి ప్రతిపాదనలు తయారుచేస్తున్నాము. విబి-జి-రామ్-జి (ఉపాధి హామీపథకం) పథకం ద్వారా, ఉద్యానవన (కొబ్బరి) తోటలు పథకంలో బాగంగా పాతవి తొలగించి కొత్తవి నాటటం కోసం, ఎకరాకు గరిష్టంగా రూ.99,181 వరకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. రైతులకు ఏ పథకం ద్వారా అధిక ప్రయోజనం కలుగుతుందో దానిని అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.atchanaidu

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!