Friday, March 6, 2026
spot_imgspot_img

ప్రతి ఇంటికీ బీజేపీ సంక్షేమం చేరవేయాలి : రామచందర్ రావు

Must read

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ముఖ్యమైన పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు హైదరాబాద్‌కు పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లాలని, ప్రతి ఇంటికి చేరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని ఆయన సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం చేసేందుకు గ్రామ గ్రామానా, ఓటు ఓటునా పార్టీ బలాన్ని పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు బీజేపీకి పట్టం కట్టే రోజు దగ్గరలోనే ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని రామచందర్ రావు స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కాషాయ పతాకం ఎగరడం తప్పదని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. తాను 40 ఏళ్లుగా పార్టీ కార్యకర్తగా బీజేపీలో కొనసాగుతున్నానన్న గర్వాన్ని వ్యక్తపరుస్తూ, అదే ఉత్సాహంతో కార్యకర్తలు కూడా పనిచేయాలని పిలుపునిచ్చారు.

బీజేపీ కృషి వల్లే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిందని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలను పదేళ్లుగా కేసీఆర్ పాలన మోసం చేసిందని, మాటలు తప్ప మరేం ఇవ్వలేదని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే స్థితిలో లేవని, రెండు పార్టీలూ రాష్ట్ర విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశాయని ఆయన ఆరోపించారు. కేవలం 600 గ్రూప్-1 పోస్టులను కూడా భర్తీ చేయలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు 42 శాతం బీసీ రిజర్వేషన్లపై జీవో జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జీఎస్టీ తగ్గింపు నిర్ణయాన్ని దేశ ప్రజలు స్వాగతించారని, అన్ని వర్గాల ప్రజలకు దాని లాభాలు అందుతున్నాయని తెలిపారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని ఆయన విమర్శించారు. రైతుల సమస్యలపై స్పందిస్తూ, ఖరీఫ్ సీజన్ ముగిసేలోపు యూరియా సరఫరా పూర్తిగా జరిగేలా కేంద్రం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో యూరియా బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!