మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఈ రోజు GHMC హార్టికల్చర్ అధికారులతో కలిసి విష్ణుపురి మరియు భ్రమరాంబికా నగర్లలోని పార్కులలో దాదాపు మూడు లక్షల రూపాయలతో చేపట్టిన మైంటెనెన్స్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్శనలో వర్షపు నీరు నిలిచి బురద గుంతలుగా మారిన ప్రదేశాలలో మట్టిని పోయించడం ద్వారా పార్క్ వినియోగదారులకు సౌకర్యం కల్పించే పనులు ప్రారంభమయ్యాయి. అదే విధంగా చెట్ల కొమ్మలను కత్తిరించి పార్కుల అందాన్ని పెంచే సుందరీకరణ పనులు కూడా చేపట్టారు. నీటి కనెక్షన్లలో లోపాలు ఉన్న చోట్ల మరమ్మతులు చేయించి, నీటి సరఫరా నిరంతరం కొనసాగేందుకు చర్యలు తీసుకున్నారు. అదనంగా, వర్షపు నీరు నిల్వ కాకుండా ఇన్కుడు గుంతలు వేసే పనులను కూడా ప్రారంభించారు.
కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ, రాత్రి వేళల్లో కొందరు ఆకతాయిలు మత్తుపదార్థాలు సేకరించి సంఘ వ్యతిరేక పనులకు పాల్పడుతున్నారని, దీనిని అరికట్టేందుకు పార్కులకు తాళాలు వేసి కాలనీ సమాఖ్యకు అప్పగించామన్నారు. ప్రజల భద్రత కోసం పోలీస్ పాట్రోల్ పెంచాలని పోలీస్ అధికారులను కోరినట్లు తెలిపారు. అదనంగా, మారుతి నగర్ పార్క్ నిర్వహణ కోసం కాలనీ సమాఖ్యకు ఇవ్వాల్సిన నిధులు గత ఆరు నెలలుగా విడుదల కాలేదని, వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని GHMC అధికారులను కోరారు.
పార్కులు కాలనీలలో ప్రజలు విశ్రాంతి తీసుకునే, పిల్లలు ఆడుకునే, వృద్ధులు నడిచే ప్రాధాన్యత గల ప్రదేశాలు కావడంతో వాటి అభివృద్ధి, సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని శ్రవణ్ హామీ ఇచ్చారు. కాలనీల సుందరీకరణతో పాటు, ప్రజలు భద్రతతో ఆనందంగా జీవించేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ మేనేజర్ మహేశ్వరి, రాజు, రమేష్, సుబ్బారావు, జైకృష్ణ, హరినాథ్ గౌడ్, మహేందర్, శంకర్, రాజేష్, రవి తదితరులు పాల్గొని పార్క్ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.




