ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం విశాఖ ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు హాప్ ఆన్ – హాప్ ఆఫ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ పర్యాటక బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. 16 కిలోమీటర్ల మేర బీచ్ రోడ్డులో నడిచే ఈ బస్సుల్లో సీఎం స్వయంగా ప్రజాప్రతినిధులతో కలిసి ప్రయాణించి ప్రజలకు అభివాదం చేశారు. 24 గంటల టికెట్ ఛార్జీ రూ.500గా నిర్ణయించగా, పర్యాటకుల సౌలభ్యం కోసం సగం మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని, కేవలం రూ.250కే పర్యాటకులు ఒక రోజంతా ప్రయాణించవచ్చని ఆయన వెల్లడించారు. పర్యాటకులు పర్యావరణహితంగా వ్యవహరించి తీరప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. విశాఖను ఆర్థిక రాజధానిగా, ఆసియా టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దుతూ డేటా సెంటర్, సీ కేబుల్ ప్రాజెక్టుల ద్వారా ప్రపంచంతో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోటీపడే స్థాయికి చేరిన విశాఖను మహిళలకు సురక్షిత నగరంగా గుర్తించడం గర్వకారణమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు




