ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచిపోతే ప్రజలు నిరసనల బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
పిఠాపురంలోని మత్స్యకార సముదాయం ఇటీవల పవన్ కల్యాణ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ డిమాండ్లు చేస్తోందని శ్యామల తెలిపారు. ఆ హామీలను నెరవేర్చాలని కోరుతూ వారు జనసేన పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారని గుర్తుచేశారు.
“పిఠాపురం సమస్యల పట్ల నిర్లక్ష్యం – సినిమా ప్రమోషన్లో మునిగిపోయిన పవన్”
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ మాత్రం ప్రజా సమస్యలపై స్పందించాల్సిన సమయంలో, సినిమాల ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని శ్యామల విమర్శించారు. ప్రజా సమస్యలు ప్రాధాన్యత కాదా? అని ప్రశ్నించిన ఆమె, “ఇలాంటి పరిస్థితుల్లోనే ‘Think Twice, Vote Wise’ (ఒకటికి రెండు సార్లు ఆలోచించండి… తెలివిగా ఓటేయండి) అనే మాట గుర్తుకు వస్తుంది” అంటూ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వ్యాఖ్యానించారు.
వ్యక్తిగత ప్రచారం, సినీ కార్యక్రమాల్లో పాల్గొనడం కన్నా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం నాయకుడిగా బాధ్యత అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజల మద్దతు పొందాలంటే హామీలను నెరవేర్చాలన్నది శ్యామల వ్యాఖ్యల సారాంశం.




