ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాలనీ, ప్రతి బస్తీలో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ స్థాయిలో నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. శనివారం ఏఎస్ రావు నగర్లోని తన క్యాంపు కార్యాలయంలో చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ పరిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కాలనీలోని స్ట్రీట్ లైట్స్, డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు, మంచినీటి సమస్య, సీసీ కెమెరాలు, బంగారు మైసమ్మ దేవాలయ అభివృద్ధి వంటి పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే, అదే రోజున జరగనున్న బోనాల పండుగకు హాజర కావాలని ఎమ్మెల్యేను ఆహ్వానించారు.
వినతిపత్రం అందుకున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, “కాలనీలో నెలకొన్న సమస్యలను త్వరలో స్వయంగా పరిశీలిస్తాను. వాటిని దశల వారీగా పరిష్కరించేందుకు సంబంధిత శాఖలతో చొరవతో పనిచేస్తాను” అని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ చర్లపల్లి డివిజన్ సీనియర్ నాయకుడు మహేష్ గౌడ్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సభ్యులు పి. అనసూయ, స్వరూప, ఎస్. పద్మ, సరస్వతి, జ్యోతి, పద్మ, మాధవి, అనసూయ తదితరులు పాల్గొన్నారు.




