సచివాలయంలో మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయ ఆధునీకరణ పనులపై దేవాదాయ శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్, కమిషనర్ వెంకట్రావు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, గిరిజన సాంస్కృతిక శాఖ అధికారులు, ఆలయ పూజారులు, నిపుణులు పాల్గొన్నారు.
భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఆలయ ప్రాంగణంలో ఆధునీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూజారుల సూచనలతో పాటు ఆదివాసీ గిరిజనుల భావోద్వేగాలను గౌరవిస్తూ, సమ్మక్క సారలమ్మల తెగువ, సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఆలయ పరిసరాలను తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు.
అమ్మల గద్దెల్లో ఎలాంటి మార్పులు చేయకుండా ఆలయ పరిసర ప్రాంతాల్లోనే ఆధునీకరణ పనులు కొనసాగనున్నాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా పూజారుల విశ్రాంతి గదులు, అత్యవసర వైద్య సేవలు, భద్రత ఏర్పాట్లు, మీడియా వసతులు కల్పించేందుకు ప్రత్యేక ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.




