గోదావరి నదిలో తెలంగాణకు న్యాయమైన నీటి వాటా లభించే వరకు బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలనే నినాదంతో బీఆర్ఎస్వీ రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజుల విస్తృత ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉద్యమం ద్వారా ప్రతి కళాశాల, ప్రతి విద్యార్థికి గోదావరి నీటి ప్రాముఖ్యతను వివరించి, చైతన్యం కలిగించడమే లక్ష్యంగా ఉంది.
ఈ క్రమంలో బీఆర్ఎస్వీ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో శాంతియుతంగా కరపత్రాలు పంపిణీ చేస్తూ, బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ గోదావరి వాటాలో సుమారు 200 టీఎంసీల నీరు కోల్పోయే ప్రమాదాన్ని విద్యార్థులకు వివరించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలు తెలంగాణ ప్రజలపై చేస్తున్న నీటి అన్యాయాన్ని ఉదాహరణలతో వివరించే ప్రయత్నంలో పోలీసులు విద్యార్థి నాయకులను అడ్డుకుని, అక్రమంగా అరెస్టు చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు తుంగ బాలు, పడాల సతీష్, నాయకులు కిషోర్ గౌడ్, కోదాటి నాగేందర్, కడారి స్వామి యాదవ్, జీడి అనిల్, కటం శివ, నరేష్, అవినాష్, సతీష్ నాగేందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమంలో భాగంగా మరో నాలుగు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు విద్యాసంస్థల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్వీ ప్రకటించింది.




