తెలుగు సినీ ప్రేక్షకులను తన కామెడీ నటనతో ఆకట్టుకున్న ప్రముఖ హాస్యనటుడు ఫిష్ వెంకట్ (వెంకట్ రాజ్) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, శుక్రవారం (జూలై 18) హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 53 సంవత్సరాలు.
గత తొమ్మిది నెలలుగా రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో డయాలసిస్ చేయించుకుంటూ చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ఇటీవల విషమించడంతో వెంటిలేటర్పై ఉంచినప్పటికీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు సూచించగా, దానికి సుమారు రూ. 50 లక్షల వ్యయం కావాల్సి ఉండడంతో కుటుంబం ఆర్థిక సహాయం కోరినట్లు ఆయన కుమార్తె స్రవంతి వెల్లడించారు. కొంతమంది సహాయహస్తం చాస్తినా, సరైన దాత లభించకపోవడం విషాదకరంగా మారింది.
ఫిష్ వెంకట్ (వెంకట్ రాజ్) తెలుగువారి హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. హైదరాబాద్లో జన్మించిన ఆయన 2000వ దశకంలో ‘ఖుషి’ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. అనంతరం ‘ఆది’, ‘బన్నీ’, ‘అదుర్స్’, ‘గబ్బర్ సింగ్’, ‘డీజే టిల్లు’ తదితర చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలంగాణ యాసలో ముచ్చటగా మాట్లాడే విధానం, విశిష్టమైన హాస్య ధోరణి ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయి.
కేవలం కామెడీ పాత్రలకే కాదు, చిన్నపాటి విలన్ పాత్రల్లోనూ తనదైన ముద్రవేశారు. ఇటీవల ఆయన నటించిన ‘స్లమ్డాగ్ హస్బెండ్’, ‘నరకాసుర’, ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ వంటి చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి.
ప్రస్తుతం ఆయన భార్య సువర్ణ, కుమార్తె స్రవంతితో కలిసి హైదరాబాద్లో నివసిస్తున్నారు. ఫిష్ వెంకట్ మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, సహనటులు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు.




