బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం బుధవారం నాడు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పాల్గొన్నారు.
సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ధరణి వ్యవస్థలోని లోపాలు, రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికలపై వ్యూహాలు కీలక చర్చాంశాలుగా నిలిచాయి.
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ:
‘‘రైతు భరోసా పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. ధరణి పత్రాల లోపాలతో రైతులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి తలెత్తింది. కేంద్రం 9.5 లక్షల మెట్రిక్ టన్నులకూ మించి, 12.02 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను పంపినా, కాంగ్రెస్ పరోక్షంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.’’
అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్, ఫసల్ బీమా యోజన, సాయిల్ హెల్త్ కార్డుల వంటి పథకాలను గ్రామీణ స్థాయిలో విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులు, జిల్లా ఇంఛార్జులు తదితరులు పాల్గొన్నారు.




